నెలలు నిండని, తక్కువ బరువుతో జన్మించిన శిశువులకు వైద్యం చేసే ప్రత్యేక విభాగాన్ని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) లేదా నర్సరీ అంటారు. ఇక్కడి పిల్లల డాక్టరును నియోనేటాలజిస్టు, నర్సును నియోనేటల్ నర్స్ అంటారు. వీరు నవజాత శిశు వైద్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన నిపుణులు.
నర్సరీలో ప్రత్యేక పరికరాలు ఉంటాయి. శిశువు నర్సరీకి చేరుకోగానే పూర్తిగా పరీక్షించి, వివిధ వ్యవస్థలు అనుక్షణం ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి కొన్ని పరికరాలను (ప్రోబ్స్) శరీరానికి అతికిస్తారు. వాటిని మానిటర్కు అనుసంధానం చేస్తారు. వీటివల్ల శిశువు శరీరానికి ఏ విధమైన గాయాలు కావు, హాని జరగదు. మానిటర్లపై గుండె వేగం, క్రమం, రక్తపోటు, శ్వాసక్రియ వేగం, శరీర ఉష్ణోగ్రత, రక్తంలో ఆక్సిజన్(O2) పరిమాణం తెలుస్తాయి. ఈ ప్రక్రియలో ఏవైనా లోపాలు ఏర్పడితే వెంటనే అలారం మోగుతుంది. దీనివల్ల డాక్టర్లు, నర్సులు అప్రమత్తమై వెంటనే సరైన చర్యలు తీసుకుంటారు.
నర్సరీకి చేరుకున్న తరువాత శిశువుకు రక్త పరీక్షలు మొదలైనవి చేస్తారు. వైద్యం చేయడానికి, చేస్తున్న వైద్యం ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి, ఆ వైద్యం ఇంకా ఎన్నిరోజులు కొనసాగించాలో నిర్ణయించడానికి వీటి ఫలితాలు ఉపకరిస్తాయి. ఈ పరీక్షల ఫలితాలను వెంటవెంటనే తల్లిదండ్రులకు తెలియజేస్తారు. కొన్ని ప్రత్యేక పరీక్షల కోసం వారి అనుమతి తీసుకుంటారు. దీనిని కన్సెంట్ అంటారు. పరీక్షల కోసం రక్తాన్ని.. తక్కువ పరిమాణంలో అవసరమైతే అరికాలి నుంచి, ఎక్కువ అవసరమైతే సిరల నుంచి తీసుకుంటారు. ప్రత్యేక సందర్భాలలో ధమనుల నుంచి కూడా తీసుకుంటారు. కొన్నిసార్లు నాభిలోని రక్త నాళాలలో ఒక ట్యూబును ఉంచుతారు. దీనిని ‘అంబెలికల్ కాథేటర్’ అంటారు. ప్రతిరోజు శిశువు బరువు, వారికి ఇచ్చే పాలు, ఐవీ ఫ్లూయిడ్స్, మూత్రం, మలం పరిమాణాలు, శరీర ఉష్ణోగ్రత ఇతర వివరాలు రికార్డు చేస్తారు. ఈ విభాగం బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.
డాక్టర్ కర్రా రమేశ్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు