Farmers | పారిస్: ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఫ్రాన్స్ రైతులపై విపరీతంగా పడుతున్నది. దీంతో రైతన్నలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. దీనిలో భాగంగా సోమవారం తమ ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పెద్ద పెద్ద గడ్డివాములతో పారిస్ను ముట్టడించారు. పారిస్కు వెళ్లే మార్గాలను ట్రాక్టర్లతో దిగ్బంధనం చేశారు. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి కనీసం నెల అయినా కాకమునుపే గాబ్రియెల్ అటల్కు ఇది కష్టకాలంగానే కనిపిస్తున్నది.
నిరసనకారులు మాట్లాడుతూ, పీఎం అటల్ గత వారం ప్రకటించిన చర్యలు తమ డిమాండ్లకు తగినట్లుగా లేవన్నారు. ఆహారోత్పత్తి చాలా ఆకర్షణీయంగా, సులభంగా, న్యాయంగా ఉండాలన్నది తమ డిమాండ్ అని చెప్పారు. తమకు మరిన్ని రాయితీలు కావాలన్నారు. ప్రభుత్వం తమకు అనుకూలంగా స్పందించకపోతే ఎంత కాలమైనా ధర్నా చేసేందుకు కొందరు నిరసనకారులు ఆహారం, నీరు, టెంట్లను తీసుకొచ్చారు.