తిరుపతి, జూలై :తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. అందులో భాగంగా ఆగస్టు 3వ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణం నిర్వహించనున్నారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఆగస్టు 4న మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, ఆగస్టు 5న రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 6న మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ మూడు రోజుల పాటు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం జరుగనుంది. సాయంత్రం ఆలయంలో ఊరేగిస్తారు.