వాషింగ్టన్: విమానం నడుపుతున్న పైలట్ అస్వస్థకు గురయ్యాడు. దీంతో ఎలాంటి శిక్షణ, అనుభవం లేకపోయినా ఒక ప్రయాణికుడు దానిని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఆశ్చర్యపరిచే ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. సింగిల్ ఇంజిన్ సెస్నా 280 విమానంలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి విమానం నడుపుతున్న పైలట్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అందులోని ఒక ప్రయాణికుడు ఫోర్ట్ పియర్స్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ను సంప్రదించాడు. విమానంలో పరిస్థితి చాలా సీరియస్గా ఉందని, పైలట్ ఆకస్మికంగా అస్వస్థతకు గురైనట్లు చెప్పాడు. దీంతో విమానం నడపడం వచ్చా అని ఆ వ్యక్తిని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అడిగాడు. విమానం నడపటం తనకు రాదని ఆ వ్యక్తి తెలిపాడు. ఫ్లోరిడా తీరం తనకు కనిపిస్తున్నదని అన్నాడు.
కాగా, ఆ విమానాన్ని ప్యాసింజర్ సీటు నుంచి కూడా కంట్రోల్ చేయవచ్చు. దీంతో అదే స్థాయిలో విమానాన్ని స్థిరంగా ఉంచాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ క్రిస్టోఫర్ ఫ్లోర్స్ చెప్పాడు. తీరానికి పశ్చిమ లేదా దక్షిణ వైపునకు విమానాన్ని నడపాలని సూచించాడు. అనంతరం ఆ విమానాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గుర్తించారు. అప్పుడు అది బోకా రాటన్ మీదుగా ఉత్తరం వైపునకు వెళ్తున్నది. ప్రయాణికుడి వాయిస్ సరిగా వినిపించకపోవడంతో కంట్రోలర్ అతడి మొబైల్ నంబర్ తీసుకున్నాడు.
మరోవైపు 20 ఏళ్ల అనుభవం ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రాబర్ట్ మోర్గాన్, విమానంలోని ప్రయాణికుడితో మాట్లాడారు. సెస్నా ఎయిర్క్రాఫ్ట్ను నడిపిన అనుభవంతోపాటు ఆ విమాన శిక్షకుడైన ఆయన అందులోని ప్రయాణికుడికి పలు సూచనలు ఇచ్చారు. ఆ విమానం ఈజీగా ల్యాండ్ అయ్యేందుకు ఆయన సహకరించారు. దీంతో ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ వెంటనే కొత్త పైలట్కు అభినందనలు అని కంట్రోలర్ రాబర్ట్ మోర్గాన్ అన్నారు. రెస్క్యూ సిబ్బంది ఆ విమానం వద్దకు వచ్చారు. అస్వస్థతకు గురైన పైలట్కు వైద్యచికిత్స అందించారు.