హైదరాబాద్ : ఐటీ రంగం అభివృద్ధి, ప్రభుత్వ సేవల్లో టెక్నాలజీల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ ఐటీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. గత రెండు రోజులుగా హైదరాబాద్లో పర్యటిస్తున్న ఇక్కడ మౌలిక వసతులతో పాటు పలు అంశాలపై అధ్యయనం నిర్వహిస్తున్నది. బుధవారం ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రాజెక్టులు, విజన్పై మంత్రి కేటీఆర్ స్థాయి సంఘానికి వివరాలు అందించారు. రానున్న కాలంలో వినూత్న కార్యక్రమాలు కొనసాగితే హైదరాబాద్ అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటికే ఆదర్శవంతమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్న తెలంగాణ పద్ధతులను, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే అంశంపైన తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామన్నారు.
ఎక్కడైనా ఆదర్శవంతమైన కార్యక్రమాలు కొనసాగితే వాటి ద్వారా నేర్చుకొని.. ప్రజా సంక్షేమానికి వాటిని అమలు చేసే విషయంలో ముందుండాలన్నదే తమ ఉద్దేశమని.. ఈ దిశగా తెలంగాణ విధానాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని కమిటీ పేర్కొంది. డిజిటల్ గవర్నెన్స్ సేవలు, ఇన్నోవేషన్ రంగంలో ఇంకుబేటర్ల ఏర్పాటు, టీ ఫైబర్ ప్రాజెక్టులపై ప్రత్యేక కమిటీ ప్రశంసలు కురిపించింది. సమావేశానంతరం కమిటీ అధ్యక్షుడు శశిథరూర్తో పాటు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపి.. జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను కేటీఆర్, ఐటీ శాఖ విభాగాల అధిపతులు పార్లమెంట్ సంఘానికి వివరించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్, ఇతర విధానపరమైన నిర్ణయాలు, ఐటీ పరిశ్రమతో కలిసి ప్రభుత్వం పని చేయడంతో అనేక పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద టెక్ కంపెనీలకు సంబంధించిన అమెరికా ఆవల అతిపెద్ద క్యాంపస్లు నాలుగు హైదరాబాద్లో ఉన్నాయన్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనతో పాటు ఐటీ ఎగుమతులను సైతం భారీగా పెంచగలిగామన్నారు. ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో వృద్ధి సాధించడానికి ప్రభుత్వం తరఫున చేపట్టిన కార్యక్రమాలను కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల వివరాలు అందించారు.
ఇన్నోవేషన్ రంగంలో ఏర్పాటు చేసిన ఇంకుబేటర్ వివరాలు అందజేశారు. టీ హబ్, వి హబ్, అగ్రి హబ్, బీ హబ్, రిచ్, టీ వర్క్ వంటి కార్యక్రమాలను వివరించారు. పార్లమెంటరీ స్థాయి సంఘం అత్యంత ఆసక్తిగా అడిగిన డిజిటల్ ఎకానమీ, గవర్నన్స్లో ఐటీ టెక్నాలజీ వినియోగానికి సంబంధించిన వివరాలను కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మీసేవ కార్యకలాపాల్లో తీసుకువచ్చిన మార్పులు ముఖ్యంగా మొబైల్ ఆధారిత ప్రభుత్వ సేవలు, కాంటాక్ట్ లెస్ గవర్నెన్స్ దిశగా చేపడుతున్న కార్యక్రమాలు.. టీ వాలెట్ సాధించిన మైలురాళ్లను వివరించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ ప్రోగ్రాంను మరింతగా విస్తరించి చేపట్టిన ప్రాజెక్టు వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా టీ ఫైబర్ ప్రాజెక్టు ప్రాధాన్యత దృష్ట్యా దీనికి ప్రత్యేకంగా కేంద్రం మద్దతు ఇవ్వాల్సిన విషయాన్ని పార్లమెంటరీ కమిటీకి తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీ ద్వారా చేపడుతున్న డ్రోన్ ప్రాజెక్టు, హరితహారంలో డ్రోన్ల వినియోగం, సైబర్ సెక్యూరిటీ సంబంధించి ప్రత్యేక చట్టాన్ని తీసుకు రానున్న విషయాలను కేటీఆర్ వివరించారు.
సీఎం కేసీఆర్ విజన్ మేరకు ఏర్పాటు చేసిన ధరణికి వినియోగిస్తున్న టెక్నాలజీ, దాని పనితీరుపై వివరాలు కమిటీకి అందించారు. తెలంగాణలాంటి రాష్ట్రాలకు ప్రత్యేకంగా సహాయం అందించడంలో కేంద్రం ప్రభుత్వం మరింత చొరవ చూపించేలా ఇక్కడి విధానాలపైన ప్రత్యేక సిఫార్సు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ కమిటీని కోరారు. తెలంగాణ లాంటి నూతన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఐటి శాఖ మరింత సహాయం అందించాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా ఐటీఐఆర్ వంటి సమాంతర ప్రాజెక్టును, అదనపు ప్రోత్సాహాన్ని వెంటనే ప్రకటించే అంశంలో ఈ కమిటీ సహకరించాలని కోరారు.