న్యూఢిల్లీ: డేటా సెక్యూర్టీ, ప్రైవసీ అంశాలపై ఇవాళ సోషల్ నెట్వర్క్ సైట్ ట్విట్టర్ సంస్థ అధికారుల్ని పార్లమెంటరీ ప్యానల్ ప్రశ్నించింది. భారత్లో జరుగుతున్న ఆపరేషన్స్పై ఇటీవల ఆ కంపెనీ ఉన్నతోద్యోగి కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. ఆ విజిల్ బ్లోయర్ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ పార్లమెంటరీ ప్యానెల్ ట్విట్టర్ అధికారుల్ని నిలదీసింది. డేటా సెక్యూర్టీ, ప్రైవసీ గురించి ప్రశ్నించింది. ట్విట్టర్ తీరు సంతృప్తికరంగా లేదని ప్యానెల్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కంపెనీ ఉద్యోగులు ఆ విజిల్ బ్లోయర్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇండియాలో ఎటువంటి డేటా సెక్యూర్టీ ఉల్లంఘన జరగలేదని అన్నారు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఐటీ విభాగం చైర్మన్ శశి థరూర్ నేతృత్వంలో ఈ మీటింగ్ జరిగింది. ట్వట్టర్ ఎగ్జిక్యూటివ్లు సమిరన్ గుప్తా, డైరెక్టర్ షాగుఫ్తా కమ్రాన్లు ఈ విచారణకు మాజరయ్యారు. పార్లమెంటరీ ప్యానెల్లో సభ్యులైన శశిథరూర్తో పాటు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, సీపీఐ ఎంపీ జాన్ బ్రిటాస్లు మీటింగ్కు హాజరయ్యారు.