ఘజియాబాద్/పాల్ఘర్: నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకొంటున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనపై భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ స్పందించారు. ఆందోళనను ఇప్పటికిప్పుడే విరమించబోమని, చట్టాల రద్దుపై పార్లమెంటులో రాజ్యాంగ ప్రక్రియ పూర్తయ్యే రోజు కోసం ఎదురుచూస్తామని తెలిపారు. కనీస మద్దతు ధర, ఇతర సమస్యలపైనా కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చించాల్సి ఉందని గుర్తుచేశారు. ‘ఆందోళన చేస్తున్న రైతులు ఇప్పుడే ఇండ్లకు వెళ్లరు. ఇక్కడ(పాల్ఘర్లో) పంటల కొనుగోళ్లు కనీస మద్దతు ధరకు అనుగుణంగా సాగటం లేదు. దేశవ్యాప్తంగా ఇదే సమస్య ఉన్నది. ఇలాంటి సమస్యలన్నింటిపైనా రైతులతో కేంద్రం చర్చలు జరపాలి’ అని పేర్కొన్నారు. మరోవైపు, తమ ప్రధాన రెండు డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయని బీకేయూ అధికార ప్రతినిధి సౌరభ్ ఉపాధ్యాయ్ పీటీఐతో పేర్కొన్నారు. మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయడంతో పాటు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు చట్టబద్ధత కల్పించడం తమ ప్రధాన డిమాండ్లని గుర్తుచేశారు. మోదీ ప్రకటనతో రైతులు సగం విజయమే సాధించారని బీకేయూ నేత సునీల్ ప్రధాన్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 19: మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటనను సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) స్వాగతించింది. దీనిపై శని, ఆదివారాల్లో కోర్కమిటీ సమావేశాల్లో చర్చించిన అనంతరం తమ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నది. ఎస్కేఎం కోర్కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ శుక్రవారం ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే త్వరలో జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే వ్యవసాయ చట్టాలను అధికారికంగా రద్దు చేసే ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనలు ఒక్క వ్యవసాయ చట్టాల రద్దు కోసం మాత్రమే కాదని, పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత, అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ డిమాండ్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయని ఎస్కేఎం అంతకుముందు ఒక ప్రకటనలో పేర్కొన్నది. ‘ఎంఎస్పీకి చట్టబద్ధత కావాలి. మా డిమాండ్లన్నీ పూర్తిగా నెరవేర్చే వరకు ఆందోళన ప్రాంతాల నుంచి వెనక్కు వెళ్లేది లేదు’ అని దర్శన్పాల్ స్పష్టం చేశారు. భవిష్యత్తు కార్యచరణపై ఏకాభిప్రాయానికి వచ్చేందుకు, అదేవిధంగా ఎంఎస్పీ, రైతుల ఇతర డిమాండ్లపై సంయుక్త కిసాన్ మోర్చా సమావేశంలో చర్చ జరుగుతుందని తెలిపారు.