ముంబై : బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం రాత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత పది రోజుల్లో తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. 65 సంవత్సరాల పరేష్ రావల్ మార్చి 9న కొవిడ్ తొలి డోస్ తీసుకున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ వారంలో అమీర్ ఖాన్, ఆర్ మాధవన్, రోహిత్ సరఫ్, కార్తీక్ ఆర్యన్ వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. పరేష్ రావల్ చివరి సారిగా డేవిడ్ ధావన్ చిత్రం కూలీ నంబర్ 1 చిత్రంలో కనిపించారు. ఇందులో హీరో హీరోయిన్లుగా వరుణ్ ధావన్, సారా అలీఖాన్ నటించారు. ప్రస్తుతం ఆయన హంగామా-2లో నటిస్తున్నారు. శిల్పాశెట్టి, మీజాన్ జాఫెరితో కలిసి తెరపై కనిపించనున్నారు.