ముంబై: నిబంధనలను ఉల్లంఘించిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, పేసర్ శార్దూల్ ఠాకూర్, సహాయక కోచ్ ప్రవీణ్ ఆమ్రేపై ఐపీఎల్ పాలక మండలి క్రమశిక్షణాచర్యలు తీసుకుంది. శుక్రవారం రాజస్థాన్తో మ్యాచ్ చివరి ఓవర్లో నోబాల్ అంశంపై పంత్.. అంపైర్ల నిర్ణయాన్ని అంగీకరించకుండా తమ ఆటగాళ్లను మైదానం వీడాలని కోరిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగగా..
ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్.. లెవల్-2 నిబంధనను అతిక్రమించినందుకు గానూ పంత్ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించారు. ప్రవీణ్ ఆమ్రే మ్యాచ్ ఫీజును కూడా వంద శాతం కోత వేసిన లీగ్ నిర్వాహకులు.. అతడిపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. పంత్కు సహకరించిన శార్దూల్ ఠాకూర్ ఫీజులో 50 శాతం కోత పడింది. ఈ మేరకు ఐపీఎల్ పాలక మండలి శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
రాజస్థాన్ విధించిన 223 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ విజయానికి చివరి ఓవర్లో 36 పరుగులు అవసరం కాగా.. మెక్కాయ్ వేసిన ఆఖరి ఓవర్ తొలి మూడు బంతులను పావెల్ సిక్సర్లుగా మలిచాడు. మూడో బంతి హై నోబ్ అనిపించడంతో డగౌట్లో ఉన్న ఢిల్లీ ఆటగాళ్లు ఈ అంశాన్ని పరిశీలించాలని అంపైర్లను కోరారు. థర్డ్ అంపైర్ను సంప్రదించాలని అడిగినా..
అంపైర్లు పట్టించుకోకపోవడంతో కోపోద్రిక్తుడైన ఢిల్లీ కెప్టెన్ పంత్.. తమ ఆటగాళ్లను మైదానం వీడి బయటకు రావాల్సిందిగా సైగలు చేశాడు. అతడికి శార్దూల్ ఠాకూర్ వంత పాడగా.. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే మైదానంలోకి వచ్చి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న పాలక మండలి క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ‘ఐపీఎల్ నియమావళి ఆర్టికల్ 2.7 ప్రకారం..
పంత్ లెవల్-2 తప్పిదానికి పాల్పడ్డాడు. అందుకే అతడి మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించాం. శార్దూల్ ఠాకూర్కు 50 శాతం.. ప్రవీణ్ ఆమ్రేకు వంద శాతంతో పాటు ఓ మ్యాచ్ నిషేధం విధించాం. మ్యాచ్ అనంతరం వాళ్లు తప్పులు అంగీకరించారు’అని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించిన ఐపీఎల్లో ఇలాంటి సంఘటన వెలుగు చూడటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్.. ఢిల్లీ ఆటగాళ్ల తీరుపై మండిపడ్డాడు. మైదానంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం అంపైర్లకే ఉంటుందని.. ఆటలో అప్పుడప్పుడు తప్పులు జరుగడం సహజమేనని.. వాటిని భూతద్దంలో చూస్తూ మరీ ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదని పంత్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఢిల్లీ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ఐసొలేషన్లో ఉండటం వల్లే ఇలాంటి తప్పిదం జరిగిందని.. అతడు మైదానంలో ఉండుంటే ఇలా జరగనిచ్చేవాడు కాదని పీటర్సన్ పేర్కొన్నాడు. అయితే మూడేండ్ల క్రితం ఇలాగే నోబాల్ విషయంలో చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మైదానంలోకి వచ్చి అంపైర్లతో వాగ్వాదానికి దిగగా.. అప్పట్లో అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం మాత్రమే జరిమానా విధించిన పాలక మండలి..
పంత్ అంశాన్ని కావాలనే హైలెట్ చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్ పిలుపుతో డగౌట్కు మళ్లిన కుల్దీప్, మెకాయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రాజస్థాన్ స్పిన్నర్ చాహల్పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.