సిద్దిపేట : జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి అన్ని గ్రామాల్లో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం జరిగేలా చూడాలి. పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చీరెల పంపిణీని చేపట్టాలని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం బతుకమ్మ, దసరా పండుగ ఏర్పాట్లు, బతుకమ్మ చీరెల పంపిణీ తదితర కార్యక్రమాలపై కలెక్టర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. మూడు రోజుల్లోగా బతుకమ్మ చీరెల పంపిణీ పూర్తి కావాలని సూచించారు. మహిళలు మెచ్చే విధంగా 19 రంగులు, 17 డిజైన్లతో మొత్తం 289 వర్ణాలతో సరికొత్తగా బతుకమ్మ చీరెలు సిద్ధమయ్యాయని, మహిళలందరికీ బతుకమ్మ చీరెలు పంపిణీ అయ్యేలా చూడాలన్నారు.
అధిక వర్షాలతో జలాశయాలు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్న నేపథ్యంలో భారీకేడ్లను ఏర్పాటు చేసి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. చెరువుల అలుగుల పై పేరుకపోయిన పాకురు, నాచుతో ప్రజలు జారిపడే అవకాశం ఉన్న దృష్ట్యా పాకురు, నాచు తొలగించాలని సూచించారు.
పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, కౌన్సిలర్లు, గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు వేడుకల నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని, పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ వేడుకలు జరిగేలా చూడాలని అన్ని గ్రామాలు, పట్టణాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయాలని, వందశాతం పూర్తయిన గ్రామాల్లో పూర్తయినట్లుగా బోర్డులు పెట్టాలన్నారు.