కరోనా మహమ్మారి వలన అన్ని రంగాలు ఎంతగా చిన్నాభిన్నం అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దాదాపు తొమ్మిది నెలల పాటు సినిమా షూటింగ్స్, రిలీజ్లు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే అన్ని సక్రమంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందంటూ ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తుండడంతో మరి కొద్ది రోజులలో విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాలపై సందిగ్ధత నెలకొంది.
కరోనా వలన ఇప్పటికే రానా నటించిన అరణ్య హిందీ వర్షెన్ వాయిదా పడింది. జూలైలో కేజీఎఫ్ 2, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా చిత్రాలు విడుదల కానుండగా, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, పుష్ప, లైగర్ వంటి పలు తెలుగు చిత్రాలు పాన్-ఇండియన్ కేటగిరీలో విడుదల కానున్నాయి. మరి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలు థియేటర్స్ లో విడుదల అవుతాయా, లేదంటే ఓటీటీ బాట పడతాయా అన్నది సగటు ప్రేక్షకుడిలో అనేక ఆలోచనలును రేకెత్తిస్తుంది.