మాజీ ప్రధాని పీవీ అరువై ఏండ్ల అమూల్య కాలం రాజకీయ, సామాజిక రంగాల జోలికిపోకుండా కేవలం వాఙ్మయ రంగానికే పరిమితమై ఉన్నట్లయితే ఈ దేశంలోని, ప్రపంచంలోని వివిధ భాషల సాహిత్యాలు, విశేషించి తెలుగు సారస్వతరంగం అద్భుతంగా సుసంపన్నమయ్యేవి. ఈ బహుభాషల సాహిత్యాల్లో ఆయన అజరామర, సృజనశీల గ్రంథాలను అందించగలిగేవాడు నోబెల్ బహుమతులు, జ్ఞాన్పీఠ్ అవార్డుల వంటి అవార్డులు అనేకం పీవీకి అయాచితంగా, అప్రయత్నంగా, అవలీలగా లభించేవి.
పీవీ నరసింహారావు మాతృభాష తెలుగులో (వివిధ ప్రాంతాల నుడికారంతో), ఆంగ్లంలో కవితలు, కథలు, నవలికలు, నవలలు, వ్యాసాలు, విశ్లేషణాత్మక సమీక్షలు, సమగ్ర నివేదికలు మొదలైనవి పుంఖానుపుంఖంగా రాశారు, అనర్ఘ సాహిత్యరత్నాల వంటి ప్రసంగాలు కావించారు.
పీవీ తన రచనల్లో, ప్రసంగాల్లో చాలా సందర్భాల్లో తన స్వభావం, ప్రవృత్తి గురించి విశ్వాసాల గురించి వివరించారు. అంతేకాదు, ఆయన మహనీయులు ఎందరివో అక్షర చిత్రాలను రచించారు. ఇవి ప్రముఖ వ్యక్తుల జీవిత చిత్రణలు. ఇవి పీవీ ఆయా వ్యక్తుల, మహా పురుషుల ఉన్నత జీవితాలను, త్యాగాలను, వారి అద్వితీయ పాత్రను అసాధారణ రీతిలో పరిశీలించిన పిదప రచించిన అక్షర చిత్రాలు. ఈ అక్షర చిత్రాలు మనోహర కళాఖండాలు మేటి చిత్రకారుల బంగారు కుంచెల నుంచి రూపొందిన కమనీయ, సజీవ చిత్రాలు. పీవీ అసాధారణ నైపుణ్యంతో సృష్టించిన ఈ అక్షర చిత్రాల్లో ఆ మహనీయుల పరిచయం కేవలం కొన్ని అక్షరాల, శబ్దాల రమ్యతతో జరగడం విశేషం. అక్షరచిత్రాలను ఆంగ్లంలో ప్రొఫైల్స్, ప్టోర్ట్రెట్స్, కారికేచర్స్ అని అంటున్నారు. కొన్నేండ్ల కిందట నేను రాసి, ప్రచురించిన ‘ చెప్పుకోదగ్గ మనుషులు’ (రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు) గ్రంథానికి రాసిన పీఠికలో సుప్రసిద్ధ విమర్శకుడు, రచయిత, మేధావి, చిత్రకారుడు రాంభట్ల కృష్ణమూర్తి తెలుగు ప్రాచీన సాహిత్యంలో అక్షర చిత్రాల నేపథ్యం ఇస్తూ లోతుగా పరిశీలించారు.
పీవీ సమకాలీనులైన కొందరు మహా పురుషుల అక్షరచిత్రాలను గీసి చూపుతూ రేఖామాత్రంగా తన అక్షర చిత్రాన్ని కూడా గీసి చూపారు. కేయూ స్నాతకోపన్యాసం ఇస్తూ పీవీ ఓరుగల్లు కవులు, రచయితల అక్షర చిత్రాలను గీస్తూ విప్లవకర అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ముఖ్యంగా పోతన, విద్యారణ్య, కాళోజీ అక్షర చిత్రాలను రచించడంలో సాటిలేని ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. సాహసోపేతమైన, శౌర్య విలసితమైన కాకతీయ రుద్రమదేవి అక్షరచిత్రాన్ని అందంగా చిత్రించారు. పీవీ రూపొందించిన భక్త కవి బమ్మెర పోతన అక్షర చిత్రం సాటిలేనిది. పోతన గురించి బహుశా ఇంతటి అభిప్రాయాలను వ్యక్తపరిచినవారు ఇంకెవరూ లేరు. ఇతరుల గురించి పద విన్యాసంతో ఎన్నో చెప్పిన, ఎంతో చెప్పిన పీవీ తన గురించి కొన్ని వాక్యాల్లో చెప్పారు. ఆయన అంటారు ‘గర్వం నా ప్రవృత్తిలో లేదు.. నా జీవితంలో ఎందరెందరికో నా చేతి మీదుగా పురస్కారాలివ్వడం, సన్మానాలు చేయడం జరిగినా స్వయంగా సన్మానాలను, సత్కారాలను స్వీకరించడమంటే నాకు మనస్కరించలేదు. సలహాలు ఇవ్వడం, స్వీకరించడం నాకు ఇష్టం కాదు. ఏదో ఒక సిద్ధాంతం గురించి మీకు (కేయూ వారికి) నేను ఉద్బోధించబోవడం లేదు. I will not submit to anything being imposed on me…
జాతిపిత, స్వాతంత్య్ర ప్రదాత గాంధీజీ, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు, హైదరాబాద్ ప్రథమ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, తన రాజకీయ గురువు స్వామి రామానంద తీర్థ తదితరుల చరిత్రాత్మక అక్షర చిత్రాలను పీవీ అత్యద్భుతంగా, ఆలోచనాత్మకంగా సృష్టించారు. గాంధీజీ 125 జయంతి సందర్భాన యునెస్కో 1995 జూన్ 12న పారిస్లో ఏర్పాటుచేసిన సదస్సులో భారత ప్రధానిగా పీవీ కావించిన సుదీర్ఘ ఇంగ్లిష్ ప్రసంగం నాటి వివేకానందుని ఇంగ్లిష్ షికాగో ప్రసంగం వలె ప్రపంచ హృదయాన్ని అలరించింది, ప్రపంచ మస్తిష్కాన్ని కదిలించింది. 20వ శతాబ్దిలో గాంధీజీ వంటి మహాత్ముడు మరొకరు లేరని పీవీ నాటి పారిస్ ప్రసంగంలో ఉద్ఘాటించారు. ‘నాటి సంక్షోభ, భయంకర పరిస్థితిలో తెలంగాణ విస్తృత పర్యటన ముగించి స్వామీజీ సజీవంగా తిరిగిరాగలరన్న ఆశ చాలమందికి లేకుండెను. స్వామీజీ మాత్రం వెనుకాడలేదు. తెలంగాణ గ్రామ గ్రామానికి వెళ్లారాయన..’ స్వామీజీకి తెలంగాణ ప్రజలపై గల ప్రేమాభిమానాల ప్రతీకగా పీవీ ఈ అక్షర చిత్రం రూపొందించారు.
బూర్గుల రామకృష్ణారావుపై పీవీ వేసిన అక్షర చిత్రంలోని ఈ మాటలు గమనార్హమైనవి He had the knack of making me feel big- bigger than what I knew I really was. The self confidence which he engendered in me has ever since stood me in very good stead, particularly on the floor of the Legislature. Such was Dr.Rama Krishna Rao, my benevolent senior. Coming to political assessment, I think Dr.Rama Krishna Rao was one of those whose overall outlook hardly admit of rigid doctrinai re pigeonholing. He was born in a Jagirdar’s family. Yet he had no hesitation in abolishing, lock stock and barrel, the age old Jagirdari system of the Nizams State.
గాంధీజీ 125 జయంతి సందర్భాన యునెస్కో 1995 జూన్ 12న పారిస్లో ఏర్పాటుచేసిన సదస్సులో భారత ప్రధానిగా పీవీ కావించిన సుదీర్ఘ ఇంగ్లిష్ ప్రసంగం నాటి వివేకానందుని ఇంగ్లిష్ షికాగో ప్రసంగం వలె ప్రపంచ హృదయాన్ని అలరించింది, ప్రపంచ మస్తిష్కాన్ని కదిలించింది. 20వ శతాబ్దిలో గాంధీజీ వంటి మహాత్ముడు మరొకరు లేరని పీవీ నాటి పారిస్ ప్రసంగంలో ఉద్ఘాటించారు.
దేవులపల్లి ప్రభాకర రావు