ఓటేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు
గ్రాడ్యుయేట్ల రుణం తీర్చుకుంటా
నేనొక్కడిని ఒకవైపు.. 70 మంది విషప్రచారం ఓవైపు
ఎవరి స్థానం ఏమిటో ఓటుతో తేల్చిచెప్పారు
విజయం సీఎం కేసీఆర్కు అంకితం
‘నమస్తే’తో పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ‘అబద్ధాలు చెప్పారు. తప్పుడు ప్రచారం చేశారు. బూతులు తిట్టారు. ఉన్నవి లేనివి మాట్లాడుతూ ప్రభుత్వం మీద, నా మీద బురద జల్లా రు. అయితే పట్టభద్రులు అన్నీ ఆలోచించారు. మేం వినమ్రంగా చెప్పిన మాటలను ఆలకించా రు. వాస్తవాలు గుర్తించి మాకే ఓటు వేసి గెలిపించారు’ అని నల్లగొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో గెలిచిన పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. పెద్దసంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు.. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకు పట్టంకట్టారని స్పష్టంచేశారు. ఇది పట్టభద్రులు, పార్టీ కార్యకర్తల విజయంగా భావిస్తున్నానని చెప్పిన పల్లా.. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
ముఖ్యమంత్రి కేసీఆర్కు అంకితం
నా గెలుపును సీఎం కేసీఆర్కు అంకితం ఇస్తున్నా. నాపై పోటీ చేసిన 70 మంది అభ్యర్థులు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే లక్ష్యంతో, అబద్ధపు ప్రచారాలు చేశారు. అయితే మా ప్రభుత్వం చేసిన పనులను, చేసే పనులను, నేను గెలిస్తే నేను పోషించే పాత్రను ప్రతీ పట్టభద్రుడికి వినమ్రంగా వివరించాను. వారందరూ ఆలోచించారు. ఇన్నాళ్లూ తమకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని గెలిపించారు.
రెచ్చగొట్టినా పట్టించుకోలేదు
ప్రతిపక్ష నాయకులు ఓట్ల కోసం విద్యార్థులను, ఉద్యోగులను రెచ్చగొట్టారు. ఉద్యోగాలివ్వలేదని కొందరంటే, ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని కొందరు తప్పుడు ప్రచారం చేశారు. ప్రభుత్వం ఆ రెండు వర్గాల కోసం చేసిన మంచిని మేము గుర్తు చేశాం. భవిష్యత్తులో కల్పించే ఉద్యోగాల గురించి వివరించాం. పట్టభద్రులు మా మాటలు విశ్వసించారు. పెద్దసంఖ్యలో ఓటింగ్లో పాల్గొని, నన్ను గెలిపించారు. ఈ ఫలితాలతో వారందరూ మావైపే నిలిచారని స్పష్టమైంది.
సైనికుల్లా పోరాడారు
టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పోరాడి నా గెలుపు కోసం కృషిచేశారు. ఎంతో ఓపికగా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను, చేయబోయే పనుల గురించి వివరించారు. ఎండను లెక్క చేయకుండా నా వెంట ఉండి మద్దతు తెలిపారు. నెలన్నర నుంచి జరిగిన ఈ పోరాటంలో నాకు మద్దతు తెలిపిన ఉద్యోగ, ఉపాధ్యాయ, ఇతర సంఘాలకు, పార్టీ క్షేత్ర స్థాయి కార్యకర్తలకు.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇచ్చిన హామీలను అమలు చేస్తాం
నేను గతంలో ఎమ్మెల్సీగా పోటీచేసినపుడు ఇచ్చిన హామీలన్నింటిని అమలుచేశా. ఈసారి కూడా ఇచ్చిన హామీలను అమలు చేస్త. నాపై విశ్వాసం ఉంచిన ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్త. సమస్యలను పరిష్కరించే గొంతుగా ఉంటా.
ఎవరు ఎటువైపో ఓటుతో చెప్పారు
పట్టభద్రులు నాకు విజయాన్ని అందించడంతోపాటు ఎవరిస్థానం ఎక్కడో చెప్పారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేశంలో బీజేపీ పార్టీ తన సిట్టింగ్ స్థానాల్లో ఓటమి పాలయ్యింది. ప్రధాని సొంత నియోజకవర్గం వారణాసిలో, ఆర్ఎస్ఎస్ కేంద్రం నాగపూర్లో, బీజేపీకి కంచుకోటగా ఉన్న పుణె, ఔరంగాబాద్ పట్టభద్రుల స్థానాల్లో బీజేపీ ఓడిపోయిం ది. ఇప్పుడు హైదరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇక నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయించిన అభ్యర్థి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఇక నేనే గొప్ప అనుకున్న కోదండరాంకు అదే పరిస్థితి వచ్చింది. ఇలా పట్టభద్రులు వారి ఓటు హక్కుతో ఎవరి స్థానం ఎక్కడో తేల్చి చెప్పారు.