స్టేషన్ఘన్పూర్, జనవరి 16 : జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో సాగునీటి సమస్య పరిష్కారానికి రూ.104.92 కోట్ల విలువైన పరిపాలనా అనుమతులు వచ్చినట్టు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి నియోజకవర్గంలో సాగునీటి సమస్య ఉన్న వేలేరు, ధర్మసాగర్, చిల్పూర్ మండలాల్లోని పలు గ్రామాలను పరిశీలించారు. అంతకుముందు మినీ లిఫ్ట్ల ఏర్పాటుకు పరిపాలన అనుమతులిచ్చినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం పల్లా మాట్లాడుతూ.. నియోజక వర్గంలోని చిల్పూర్, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లో ఎత్తుగా ఉన్న, కరువు పీడిత గ్రామాలకు సాగునీరు ఇచ్చేందుకు రూ.63.80 కోట్లు, గుండ్లసాగరం వద్ద పైప్లైన్ నిర్మాణంతోపాటు లిఫ్ట్ ఏర్పాటుకు రూ.9.70 కోట్లు, నష్కల్ వద్ద లిఫ్ట్ నిర్మాణానికి రూ.31.42 కోట్లు మొత్తంగా మూడు మినీ లిఫ్ట్ల నిర్మాణానికి రూ.104.92 కోట్ల మంజూ రు కోసం జీవో జారీ అయిందన్నారు.