మహబూబ్నగర్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద డిసెంబర్ 31 నాటికి భూసేకరణతో పాటు, ఇతర మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆయా ప్రాజెక్టుల కింద భూసేకరణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంజనీరింగ్, రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ మంగళవారం సమీక్ష చేపట్టారు. అధికారులు ఏదైనా అవార్డు పాస్ చేసే ముందు సర్వే నంబరు, ఆవార్డీ పేర్లను మరోసారి పరిశీలన చేసుకొని అవార్డు ఇవ్వాలని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
అదేవిధంగా జాతీయ రహదారుల కింద భూసేకరణ, భారత్ మాల రహదారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జాతీయ రహదారుల కింద భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద కోర్టు కేసులకు సంబంధించి భూసేకరణ అధికారులు, ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది , అలాగే ఇంజనీరింగ్ అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఆదనపు కలెక్టర్ కే. సీతారామారావు, డీఆర్ఓ కే. స్వర్ణలత, ఆర్డీవో పద్మశ్రీ, నేషనల్ హైవే అథారిటీ కన్సల్టెంట్ సత్యనారాయణ, సర్వే ల్యాండ్ రికార్డు ఏడీ శ్యాంసుందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.