ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ఎంపీ అమీర్ లయాఖత్ హుస్సేన్ (49) గురువారం మరణించారు. కరాచీలోని తన నివాసంలో ఎంపీ కుప్పకూలడంతో అగాఖాన్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అమీర్ లయాఖత్ ఉద్యోగి ఒకరు ఈ సమాచారం అందించాడని పీటీఐ నేత జమాల్ సిద్ధిఖీ ఎంపీ మరణాన్ని ధ్రువీకరించారు.
పోస్ట్మార్టం నివేదిక అందిన తర్వాతే ఎంపీ అమీర్ లయాఖత్ మరణానికి కారణాలు వెల్లడవుతాయని డాక్టర్లు పేర్కొన్నారు. ఎంపీ గురువారం అస్వస్ధతకు లోనవగా ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించారు. ఆపై కొద్దిసేపటికే తన గదిలో కుప్పకూలగా తలుపులు బద్దలు కొట్టిన సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. ఎంపీ మరణం వెనుక ఎలాంటి అనుమానాలూ లేవని ప్రాధమికంగా వెల్లడైందని కరాచీ డీఐజీ ఈస్ట్ ముఖుద్దస్ హైదర్ వెల్లడించారు.
ఎంపీ మృతిపై విచారణ చేపట్టిన పోలీసులు కరాచీలోని కుదాదద్ కాలనీలోని ఆయన ఇంటిలో సోదాలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎంపీ మరణించారనే సమాచారం అందడంతో పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ రాజా పర్వేజ్ అష్రఫ్ సభను శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకూ వాయిదా వేశారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీని వీడిన క్రమంలో తాను దేశం వీడి వెళతానని గతంలో అమీర్ చెప్పారు.