షార్జా: అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ జట్టు టీ20 ప్రపంచకప్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. తొలి పోరులో భారత్పై గెలిచిన పాక్.. మంగళవారం రెండో మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. సూపర్-12లో భాగంగా హోరాహోరీగా సాగిన పోరులో మొదట న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసింది. డారిల్ మిషెల్ (27), కాన్వే (27), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (25)కు మెరుగైన ఆరంభాలు లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. పాక్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ హరీస్ రౌఫ్ 4 వికెట్లతో సత్తాచాటగా.. టీమ్ఇండియా టాపార్డర్ను దెబ్బకొట్టిన షాహీన్ షా అఫ్రిది పొదుపుగా బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టారు.
ఆరంభం నుంచి ఒత్తిడి కొనసాగించిన పాక్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ.. కివీస్ను కోలుకోనివ్వకుండా చేశారు. అనంతరం లక్ష్యఛేదనలో పాక్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (33), ఆసిఫ్ అలీ (12 బంతుల్లో 27 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు), సీనియర్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ (26 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) తలా కొన్ని పరుగులు చేశారు. లక్ష్యం చిన్నదే అయినా కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఒక దశలో పాక్ విజయం కష్టమే అనిపించింది. భారత్తో పోరులో దంచి కొట్టిన కెప్టెన్ బాబర్ (9) త్వరగానే ఔట్ కాగా.. ఫఖర్ (11), హఫీజ్ (11), వసీమ్ (11) ప్రభావం చూపలేకపోయారు. విజయానికి 4 ఓవర్లలో 37 పరుగులు అవసరమైన దశలో ఆసిఫ్ రెండు సిక్సర్లు, మాలిక్ 4,6 బాదడంతో పాక్ గెలుపు తీరాలకు చేరింది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 20 ఓవర్లలో 134/8 (కాన్వే, 27, డారిల్ 27; రౌఫ్ 4/22), పాకిస్థాన్: 18.4 ఓవర్లలో 135/5 (రిజ్వాన్ 33, ఆసిఫ్ 27 నాటౌట్; సోధి 2/28).