ఇస్లామాబాద్: గతంలో అమెరికాతో జతకట్టి తప్పు చేశామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్(Khawaja Asif) అన్నారు. ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో ఆ నష్టం భారీగా జరిగిందన్నారు. పాకిస్థాన్ పార్లమెంట్లో ఆయన ప్రసంగించారు. వ్యూహాత్మక అవసరాల కోసం అమెరికా తమను వాడుకున్నదని, లక్ష్యాలు నెరవేరిన తర్వాత తమను వదిలేసిందన్నారు. టాయిలెట్ పేపర్ కన్నా హీనంగా తమను అమెరికా చూసిందని మంత్రి ఖవాజా అన్నారు.
గతంలో మిలిటెంట్లకు సపోర్టు చేసి తప్పు చేశామని ఆసిప్ అంగీకరించారు. దీన్ని వ్యతిరేకించడం వల్ల తమకు దీర్ఘకాలిక నష్టం జరిగిందన్నారు. గతంలో మిలిటరీ పాలకులు చేసిన తప్పిదాల వల్ల పాకిస్థాన్లో ఉగ్రవాదం పెరిగినట్లు మంత్రి ఆసిఫ్ చెప్పారు. రెండు ఆఫ్ఘన్ యుద్ధాల్లో పాకిస్థాన్ పాలుపంచుకోవడం తప్పిదమే అని వెల్లడించారు. సెప్టెంబర్ లెవన్ దాడుల తర్వాత అమెరికాతో తాము సన్నిహితంగా ఉన్నామని, తాలిబాన్ను వ్యతిరేకించామన్నారు. అయితే ఆఫ్ఘన్ నుంచి అమెరికా ఉపసంహరించిన తర్వాత పాకిస్థాన్ వంటరైందన్నారు. దీని వల్ల హింసా, విప్లవం, ఆర్థిక సమస్యలు ఉత్పన్నమైనట్లు చెప్పారు.
మతపరమైన అవసరాల కోసం ఆఫ్ఘన్ యుద్ధాల్లో పాకిస్థాన్ కలిసినట్లు వస్తున్న ఆరోపణలను పాక్ రక్షణ మంత్రి ఖండించారు. మాజీ మిలిటరీ నియంతులు జియా ఉల్ హక్, పర్వేజ్ ముషర్రఫ్లు ఆఫ్ఘన్ యుద్ధంలో పాల్గొన్నారని, అగ్రరాజ్యం అమెరికాను సంతోషపెట్టేందుకు తప్ప, ఇస్లాం మతం కోసం కాదన్నారు. ఆ యుద్ధాలను సమర్థించుకునేందుకు పాకిస్థాన్ విద్యా వ్యవస్థను కూడా మార్చేశారని ఆయన ఆరోపించారు. దీని వల్ల నష్టం అపారంగా జరిగిందని, అది రివర్స్ చేయలేని రీతిలో ఉందన్నారు. పాకిస్థాన్కు జరిగిన నష్టాన్ని ఎన్నటికీ పూడ్చలేమన్నారు.
Khwaja Asif admits in Parliament that Pakistan rented itself out to the U.S. for war and was later discarded “like toilet paper”. Afghanistan was destroyed by policies now openly acknowledged in parliament. Millions suffered. Generations were lost. The world cannot look away now… pic.twitter.com/aEQjrm16ME
— Mariam Solaimankhil (@Mariamistan) February 10, 2026