ODI WC 2023 : వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్(ODI World Cup 2023) వచ్చినప్పటి నుంచి పాకిస్థాన్(Pakistan) జట్టు ఆడతుందా? లేదా? అనే సందిగ్ధతకు తెరపడింది. భారత్లో పర్యటించేందుకు పాక్ టీమ్కు అనుమతి లభించింది. తమ జట్టను ఇండియాకు పంపేందుకు పాక్ ప్రభుత్వం ఈరోజు అంగీకారం తెలిపింది. ‘పాకిస్థాన్ ఎప్పటి నుంచో రాజకీయాలను ఆటలతో ముడి పెట్టడం లేదు. అందుకని వరల్డ్ కప్లో ఆడేందుకు మా జట్టును భారత్కు పంపడానికి అనుమతి ఇస్తున్నాం. భారత్తో దౌత్య సంబంధాలపై అంతర్జాతీయ మ్యాచ్లపై పడకుండా చూడాలని పాక్ గట్టిగా విశ్వసిస్తోంది’ అని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
అంతేకాదు ఆసియా కప్ కోసం బీసీసీఐ భారత జట్టును పాకిస్థాన్కు పంపడానికి అంగీకరించలేదని, అయినా సరే ప్రతీకారంగా తాము తమ జట్టను పంపొద్దని అనుకోవడం లేదని వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్ 5న వన్డే ప్రపంచ కప్ మొదలవ్వనుంది. ఈమధ్యే భారత్కు వచ్చిన పాక్ అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పాకిస్థాన్ జట్టు ఆడనున్న స్టేడియాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏమైతేనేం.. పాకిస్థాన్ వరల్డ్ కప్లో ఆడేందుకు వస్తోంది.
దాయాది జట్టు 2016 టీ20 ప్రపంచ కప్ తర్వాత మనదేశానికి రావడం ఇదే మొదటిసారి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్లో జరుగనుంది. అయితే.. అంతకంటే ముందే ఈ చిరాకాల ప్రత్యర్థులు అగస్టు 30 నుంచి మొదలయ్యే ఆసియా కప్లో తలపడనున్నాయి.
హైబ్రిడ్ మోడల్(Hybrid Model)లో నిర్వహిస్తున్న ఈ టోర్నీకి శ్రీలంక, పాక్ ఆతిథ్యం ఇస్తున్నాయి. మామూలుగా షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్థాన్లో జరగాల్సింది. కానీ, భద్రత కారణాల దృష్ట్యా టీమిండియాను పంపబోమని బీసీసీఐ సెక్రటరీ జై షా తేల్చి చెప్పాడు. దాంతో, అప్పటి పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజం సేథీ(Najam Sethi) హైబ్రిడ్ మోడల్ను ప్రతిపాదించాడు. అందుకు భారత్ సహా అన్ని జట్లు ఓకే చెప్పడంతో టోర్నీ షెడ్యూల్ విడుదల చేశారు.