హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన నలుగురు సోమవారం పద్మ పురస్కారాలు అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన రెండో విడుత పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా 65 మంది అవార్డులు స్వీకరించారు. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా, జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్లా పద్మభూషణ్, సకిని రామచంద్రయ్య, పద్మజారెడ్డి పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. నటుడు విక్రమ్ బెనర్జీ పద్మభూషణ్ అందుకోగా, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, ప్రము ఖ సింగర్ సోనూ నిగమ్ పద్మశ్రీ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ తదితరులు హాజరయ్యారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కార్యక్రమానికి రాలేదు. ఈ నెల 21న జరిగిన మొదటి విడుత ప్రదానోత్సవంలో ప్రముఖ కిన్నెరమెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్య సహా 54 మందికి అవార్డులు అందజేశారు. ఈ ఏడాది నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మంది పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.