బొంరాస్పేట, డిసెంబర్ 12 : ఎక్కువ మంది కూలీలను వినియోగించి ధాన్యం తూకం వేగవంతం చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి(డీసీఎస్వో) రాజేశ్వర్, డీఆర్డీవో ఏపీడీ నర్సింహులు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. ఆదివారం బొంరాస్పేట ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు సందర్శించి ధాన్యం కొనుగోళ్లు, తేమ శాతం, రైతులకు ఖాళీ బస్తాలు ఇవ్వడం, ధాన్యం లిఫ్టింగ్ వంటి అంశాలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఎక్కువగా ఉందని.. కూలీలను ఎక్కువగా ఉపయోగించి తూకం చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రానికి తక్షణమే 15 వేల ఖాళీ సంచులు ఇస్తామని.. సోమవారం నుంచి తూకం చేసిన బస్తాలను ఐదు లారీల్లో మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఖాళీ సంచులు ఇవ్వకపోవడంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించడం కష్టంగా మారిందని, డిపాజిట్ తీసుకుని ఖాళీ సంచులు ఇవ్వాలని రైతులు అధికారులను కోరారు. అంతకు ముందు కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి రికార్డులను డీసీఎస్వో పరిశీలించారు. ప్రతిరోజూ ఎన్ని లారీల్లో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారని ఆయన అడిగి తెలుసుకున్నారు. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి తాలు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు రైతులకు సూచించారు. అధికారుల వెంట కొడంగల్ ఏడీఏ వినయ్కుమార్, ఏవో రాజేశ్కుమార్, ఏఈవో ఐజాక్ హెరాల్డ్, టీఆర్ఎస్ నాయకుడు టీటీ రాములు ఉన్నారు.