విత్తనోత్పత్తిలో ప్రపంచానికే ఆదర్శంగా మారి,
వరి దిగుబడిలో పంజాబ్ను సైతం దాటుకుని,
తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మార్చుకుని…
…ఏడేండ్లు కాలేదు!
వ్యవసాయం దండుగన్నవారిని మరుస్తూ,
పదునుతో పొలమూ, చెమటతో రైతు మెరుస్తూ,
ఠంగుఠంగున మోగే బ్యాంకు ఖాతాలతో
మురుస్తూ, పండుగలా రైతు రాజ్యం తెచ్చుకుని…
…ఏడేండ్లు ఇంకా పూర్తి కాలేదు!
ఏండ్లుగా పడావుబడిన పొలాలు ఎకాయెకిన పారిన గోదావరి జీవ జలంతో అద్భుతమైన వడ్ల దిగుబడి ఇస్తుంటే… మరో పదేండ్లు ఇట్లాగే వరి పండించుకుంటే గరిశల్లో, గాదెల్లో సిరులు నిండినట్టే, కుటుంబం బాగుపడ్డట్టే, జీవితం స్థిరపడ్డట్టే అని అన్నదాతలో ఆశలు మోసులెత్తి.. …ఏడేైండ్లెనా కానే కాలేదు!
కల్తీ విత్తులు ఏరిపారేసుకొని, కాళేశ్వరంతో గోదారిని మళ్లించుకుని, పాడుబడ్డ చెరువును కాకతీయతో బాగు చేసుకుని, బోరు-బావికి 24 గంటల ఉచిత కరెంటిచ్చుకుని, బీడువారిన పొలాన్ని పచ్చగా పారించుకుని, మోడు వారిన జీవితాలను మళ్లీ చిగురింపజేసుకుని…
…ఇంకా ఏడేైండ్లెనా కాలేదు!
రైతు బంధు సాయం అందుకుని, రైతు బీమాతో భరోసా ఇచ్చుకుని, రైతు వేదికలు కట్టుకుని, బాకీల నుంచి బయటపడి, ఆత్మహత్యల ఆలోచనే మానుకుని, కొత్త జీవితాలు మొలకెత్తుకుని…
…ఏడేండ్లు కానే కాలేదు!
తెలంగాణలో వరి పండించవద్దని ఆంక్షలు విధించారు.
కాదని వరి వేస్తే కొనే బాధ్యత తమది కాదని తేల్చి చెప్పారు.
దొడ్డు బియ్యాన్ని తాము తీసుకునే ప్రసక్తే లేదని తాఖీదులిచ్చారు.
లేఖల మీద లేఖలు, కొర్రీల మీద కొర్రీలు, ఆంక్షల మీద ఆంక్షలు
ముఖ్యమంత్రి కేసీఆర్, అధికారులు అనేకమార్లు ఢిల్లీ వెళ్లి
బతిమాలి, బామాలి మా రైతు ఆగమవుతాడని విన్నవిస్తే
విన్నట్టే విని, కొన్నట్టే కొని, మళ్లీ కొర్రీలకు దిగారు.
పోయిన యాసంగి ధాన్యాన్ని ఇప్పటికీ మొత్తం కొనలేదు!
రైతులను ఇతర పంటలకు మార్చండని రాష్ర్టాన్ని ఆదేశించారు!
వడ్లను సేకరించేది రాష్ట్రం… బియ్యాన్ని తీసుకునేది ఎఫ్సీఐ…
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వాటిని పంపిణీ చేసేది కేంద్రం!
బియ్యాన్ని తీసుకోవాల్సిన కేంద్ర సర్కారే మేం తీసుకోం అంటే?!
రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? వడ్లను సేకరించి ఎక్కడపోయాలి?
వాటిని కొనేదెవరు? వాడేదెవరు? ఎగుమతి చేసేదెవరు?
తెలంగాణ రైతు, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం
ఇప్పుడొక నిస్సహాయ స్థితిలో చిక్కుకున్నాయి.
ఇప్పుడు రైతు వరి నుంచి మారక తప్పని పరిస్థితి.
వరి పండినా రాష్ట్ర ప్రభుత్వం కొనలేని నిస్సహాయ స్థితి.
ఇంతకుముందే బ్రేకింగ్ న్యూస్లో ఒక మంత్రి అన్నడట.. యాసంగిలో ధాన్యం పండించొద్దని. నేను ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నా.. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో రైతులు పక్కాగా ధాన్యం పండిస్తరు. పక్కాగా పండిస్తరు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కొనిపిస్తం.
ఇది బండి సంజయ్ శనివారం చేసిన ప్రకటన వరి వేయ వద్దంటూ ఇప్పటికే కేంద్రం నాలుగు లేఖలు రాస్తే బండి సంజయ్ మాత్రం వరే వేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనదో తాను చూస్తానని బడాయిలు పోతున్నారు. కొననంటున్నది కేంద్రం.. మరి ఆయన తొడగొట్టాల్సింది ఎవరిమీద? ఇందులోని రాజకీయం సుస్పష్టం. కేంద్రమే వద్దంటున్న వరిని రైతులతో సాగు చేయించాలి. పండిన ధాన్యం అమ్ముడు పోక రైతులు ఆగం కావాలి..
అప్పుడు వాళ్లను రెచ్చగొట్టాలి.. రోడ్ల మీదకు తీసుకురావాలి. ధర్నాలు చేయించాలి.. ఉద్వేగాలు రేపాలి.. రాజకీయ గందరగోళం సృష్టించాలి. రైతు ప్రభుత్వమైన టీఆర్ఎస్ను ఇరకాటంలోకి నెట్టాలి. రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి.
దేశంలో మనదగ్గర బియ్యం, గోధుమల నిల్వలు పేరుకుపోయాయి. మరోవైపు పప్పు దినుసులు, నూనె గింజల కొరత ఉన్నది. కాబట్టి రైతులను ఇతర పంటలను సాగుచేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయాలని తెలంగాణ అధికారులు కోరారు. బాయిల్డ్ రైస్ సేకరణ పరిమితంగానే జరుగుతుంది. అదనంగా ఒక్క గింజ కూడా తీసుకొనేది లేదు. 2021-22 యాసంగికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయదు.
-అన్ని రాష్ర్టాల పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే
దేశంలో బాయిల్డ్ రైస్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ఏడాది యాసంగి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బాయిల్డ్ రైస్ను ఎఫ్సీఐ కొనుగోలు చేయదు. రైతులు ఇతర పంటలు వేసేలా ప్రోత్సహించాలి. ఇదే విషయాన్ని కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సైతం స్పష్టం చేశారు.
భవిష్యత్లో ఎఫ్సీఐ తెలంగాణ నుంచి ఎలాంటి బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయదు. సీఎం కేసీఆర్ చొరవతో గత యాసంగికి సంబంధించి 24.75లక్షల మెట్రిక్ టన్నులకు అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకొనేందుకు ఎఫ్సీఐ అంగీకరిస్తుంది. అయితే తమ షరతులకు కట్టుబడి ఉంటామని తెలంగాణ రీజియన్ ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ తెలంగాణ ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకమైన హామీని తీసుకోవాల్సి ఉంటుంది.
-తెలంగాణ పౌరసరఫరాల శాఖకు, ఎఫ్సీఐ సౌత్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు కేంద్రం రాసిన లేఖ
సీఎం కేసీఆర్ చొరవతో గత యాసంగికి సంబంధించి అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ తీసుకొనేందుకు అంగీకరించిన కేంద్రం.. వెంటనే మరో కొర్రి పెట్టింది. బాయిల్డ్ రైస్ బదులు 16.80 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలని తెలంగాణకు షరతు విధింస్తూ లేఖ రాసింది.
-ఎఫ్సీఐ తెలంగాణ జీఎంకు ఎఫ్సీఐ రాసిన లేఖ
పై నాలుగు లేఖలు..
గత నలభై రోజుల్లో కేంద్ర ప్రభుత్వం,
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత
ఆహార సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వానికి రాసినవి.
వీటన్నింటి సారాంశమూ ఒకటే. ఇకపై రాష్ర్టాల నుంచి దొడ్డు వడ్లను కొనబోయేది లేదని కరాఖండిగా చేసిన ప్రకటనలే ఇవి. వడ్లకు బదులు ఇతర పంటలను పండించేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన సలహాలు, సూచనలివి. మన రాష్ట్రంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాత్రం.. రైతులు వరిని మాత్రమే పండించాలంటూ పిలుపుల మీద పిలుపులిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ధాన్యాన్ని కొనేలా చేస్తామని ప్రకటనలిస్తున్నారు. రైతన్న జీవితంతో అత్యంత ప్రమాదకరమైన చెలగాటమాడుతున్నారు బండి సంజయ్. రైతుల్లో తీవ్రమైన గందరగోళం సృష్టించి, ధర్నాలు చేయించి, నిరసనలకు, దీక్షలకు ప్రేరేపించి.. వారి జీవితాలను ఆగం చేయాలనుకొంటున్నారు. ఈ గందరగోళంలో నుంచే రాజకీయంగా లబ్ధి పొందాలన్న కుయుక్తులకు తెరలేపారు. పార్లమెంట్ సభ్యుడిగా ధాన్యం ఎవరు కొనాలో.. కేంద్రంలో ఏం జరుగుతున్నదో తెలియందేమీ కాదు. కేంద్రంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీయే అధికారంలో ఉన్నది. ఆయన ఆ పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు. దేశవ్యాప్తంగా ధాన్యాన్ని రాష్ర్టాల నుంచి భారత ఆహార సంస్థ ద్వారా సేకరించాల్సింది కేంద్రం అన్న విషయం ఆయనకు బాజాప్తా తెలుసు. కేంద్రం కొనకపోతే.. రాష్ర్టాలు ఏమీ చేయలేవన్న సంగతీ తెలుసు. అయినా సరే.. రైతులను వరి వేయాలంటూ రెచ్చగొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందన్న భ్రమ కల్పిస్తున్నారు. దశాబ్దాల తరబడి కునారిల్లిపోయి.. ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న తెలంగాణ రైతులను తన క్షుద్ర రాజకీయం కోసం నిర్లజ్జగా బలిపెడుతున్నారు. బండి సంజయ్ లక్ష్యం ఒక్కటే.. రైతులంతా వరివేయాలి. దాన్ని కేంద్రం ఎలాగూ సేకరించదు. దగాపడ్డ రైతు ధాన్యం అమ్ముడుపోక ఆగమాగం కావాలి. అల్లాడిపోవాలి.. ఆ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టేయాలి. ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలి? ఇప్పటికే నల్ల చట్టాలతో రైతుల మెడలు విరిచేసిన కేంద్రం ఇప్పుడు ధాన్యం సేకరణ నుంచి కూడా తప్పుకొంటే.. ఈ సంజయ్ గారి బండి ఎటువైపు పోవాలి? ఎక్కడికి పోవాలి? ఎవరిని అడగాలి? ఎవరి పైన దీక్షలు చేయాలి? ఎవరి మెడలు వచ్చి ధాన్యం సేకరించేలా చేయాలి? కొంచెమైనా ఇంగితం లేకుండా.. ఈ దేశ పార్లమెంట్ సభ్యుడన్న బాధ్యత లేకుండా, జవాబుదారీతనం లేకుండా.. రైతులను రెచ్చగొట్టడం అన్ని క్రిమినల్ నేరాల కంటే కూడా దారుణమైంది. 2019లో పసుపుబోర్డు రాదని తెలిసి తెలిసీ రైతులను బాండు పేపర్లు రాసి మరీ.. ఒక ఎన్నిక గెలిచారు.. తర్వాత బోర్డు రాలేదు. పసుపు రైతులు నిండా మునిగారు. ఇప్పుడు అత్యంత కీలకమైన వరి రైతుల జీవితాలతో దారుణాతి దారుణంగా ఆడుకొంటున్నారు. కేవలం ఎన్నికల రాజకీయం కోసం అన్నదాతలను బలిపీఠంపై నిలిపి రాజకీయ లబ్ధి పొందాలని దుష్టపన్నాగాలు పన్నుతున్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. యాసంగి ధాన్యాన్ని కొనేది లేదని కేంద్రం ఇప్పటికే చాలాసార్లు ప్రకటించింది. కాని, ఎంపీ స్థాయిలో ఉన్న బండిసంజయ్ రైతులను తప్పు దారి పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. రైతుల మీద ప్రేమ ఉంటే తాను కేంద్రం పై పోరాటం చేయవచ్చు. రైతులకు మేలు చేసేలా నిరసన గళం వినిపించవచ్చు. నిజంగా అలాంటి ఆలోచనే ఉంటే కేంద్రంలో ఉన్న సొంత పార్టీని ఒప్పించి ఆదేశాలు జారీ చేయించవచ్చు. యాసంగి వరి పంటను కొనుగోలుచేస్తామని కేంద్రం నుంచి ప్రకటన విడుదల చేయించవచ్చు. అలా కాకుండా కేవలం నోటి మాటలతో ఇష్టారీతిగా మాట్లాడి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలు చేసేలా పోరాటం చేస్తామంటూ తప్పుడు కూతలు కూస్తున్నారు. నిర్ణయం కేంద్రం చేతిలో ఉంటే, రాష్ట్రంపై పోరాటమంటూ వింత పోకడలు పోతున్నారు.
కేంద్రం నిర్ణయం వల్ల రైతులు నష్టపోవద్దనే రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు చెప్తున్నది. వరి కాకుండా ఇతర పంటలు వేయాలని సూచిస్తున్నది. కాని బండి సంజయ్ మాత్రం తన చేతిలోనే మొత్తం ఉందనుకుంటూ, రైతులను మభ్యపెడుతున్నారు. ఇలాంటి ప్రకటనల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. వారి కుటుంబాలు ఆగమయితాయి. ఒకవేళ బండి సంజయ్ మాటలు విని, రైతులు యాసంగిలో వరి పండిస్తే పరిస్థితి ఏంటి.? పెద్ద మొత్తంలో వచ్చిన పంటను ఎవరు కొనుగోలు చేస్తారు? ఒకవేళ కొనుగోలు చేయకుంటే రైతులను ఎవరు ఆదుకుంటారు? రైతులు రోడ్డు మీద పడితే ఎవరు బాధ్యత వహిస్తారు? వీటన్నింటికి బండి సంజయ్ సమాధానం చెప్తారా? కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన బండి.. రాష్ట్ర ప్రభుత్వంపైకి నెపం నెడ్తున్నారు.
గోదావరి జిల్లాల తరహాలో తెలంగాణ అన్నపూర్ణ కావాలని రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం వ్యవసాయరంగంపై దృష్టి సారించింది. రైతుల సంక్షేమం, పంటల దిగుబడికి పెద్దపీట వేసింది. లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం నిర్మించి నీటి లభ్యతను పెంచింది. గతంలో బీడు పడిన భూములు సైతం ఆకుపచ్చగా మారాయి. 24 నిరంతర విద్యుత్, రైతు బీమా, రైతుబంధు వంటి వినూత్న పథకాలు వ్యవసాయం చేసే రైతులకు అండగా నిలిచాయి. దీంతో సాగు విస్తీర్ణం అసాధారణంగా పెరిగింది. తెలంగాణ పచ్చబడటం చూసి ఓర్వలేని బీజేపీ దుష్టపన్నాగానికి తెరలేపింది. పండించిన పంటను కొనేది లేదని చెప్పి రైతుల నోట్లో మట్టి కొట్టింది. కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన సమయంలో నోరు మెదపని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇప్పుడు రాష్ట్రాన్ని ప్రశ్నిస్తున్నారు. తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. రైతులను బలి చేసేందుకు చూస్తున్నారు. అభంశుభం తెలియని రైతులను యాసంగిలో వరి వేయాలని ప్రేరేపించి.. నడి రోడ్డు మీద వదిలిపెట్టి తమాషా చూడాలని ప్రయత్నిస్తున్నారు.
-హైదరాబాద్, నమస్తే తెలంగాణ