హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేశారు. ఎర్రమంజిల్లోని పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని, రూ.1960 కంటే తక్కువకు కూడా ఎవరూ అమ్ముకోవద్దని సూచించారు. బస్తాల కొరత రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని సివిల్ సప్లయ్ అధికారులు, అదనపు కలెక్టర్లు, పోలీసుల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించినట్లు చెప్పారు.
ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టి.. మే నెలాఖరు, జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. కేంద్రం బాధ్యతల నుంచి తప్పించుకుందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన సమయంలో డ్యాష్ బోర్డులో పేరు కనిపిస్తుందని, రైతు సెల్ఫోన్కు ఓటీపీ వస్తుందని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం రాష్ట్రానికి 51 ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రతీ కొనుగోలు కేంద్రానికి ఒక్కో నోడల్ అధికారిని నియమించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 34 లక్షల ఎకరాల్లో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లకు 15కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని, ప్రస్తుతం కోటి60లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇంకా 7.50కోట్ల కొత్త బ్యాగులు అవసరమవుతాయన్నారు. రవాణాకు సైతం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎస్సీఐ చేతిలో గోదాములు ఉంటాయని, ఎక్కడ స్థలం ఉంటే అక్కడ తీసుకోవాలని అధికారులుకు సూచించినట్లు చెప్పారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో సీఎం కేసీఆర్ మెడలు వంచినం అనడానికి బీజేపీ నేత బండి సంజయ్కి సిగ్గుండాలని మంత్రి గంగుల ఫైర్ అయ్యారు. మీరు ఎవరి మెడలు వంచారని రైతుబంధు ఇస్తున్నాం ? రైతుబీమా ఇస్తున్నాం.. కరెంటు ఇస్తున్నాం అంటూ ప్రశ్నించారు. మీవల్లయితే గుజరాత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని హితవు పలికారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను అక్కడ కూడా అమలుచేయమని అడగాలని, అక్కడికి వెళ్లి మెడలు వంచాలన్నారు. దేశం మొత్తం కరెంట్, రైతుబంధు ఇవ్వమని మోదీ మెడలు వంచాలని సూచించారు.
ధరల పెరుగుదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నీవల్లయితే కేంద్రం మెడలు వచ్చి వాటి ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతుల బాధలు చూడలేక సీఎం కేసీఆర్ మావతావాది కాబట్టి ధాన్యం కొంటామన్నారని, వరి వద్దంటే వేయించి బీజేపీ నేతలు తప్పించుకొని తిరుగుతున్నారన్నారు. రా రైస్ మాత్రమే కొంటాం అంటున్నారని, రా రైస్ ఎంత కొంటారో చెప్పాలని బీజేపీ నేతలను మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి వచ్చే రా రైస్ మొత్తం కేంద్రమే కొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో విఫలమైందన్నారు. వరిపండించే రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. ఎఫ్సీఐని ఎత్తివేసే కుట్రలో కేంద్ర ప్రభుత్వం ఉందని మంత్రి గంగుల ఆరోపించారు.