హైదరాబాద్ : రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు తనపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు. పాలక పార్టీ మద్దతుదారుల మెప్పు కోసం బీజేపీని వ్యతిరేకించే వారిపై కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ, యతి, నవీన్ జిందాల్పై కేసు పెట్టేందుకు ఢిల్లీ పోలీసులు భయపడుతున్నట్టు కనిపిస్తోందని ఓవైసీ దుయ్యబట్టారు. ఓ వైపు మహ్మద్ ప్రవక్తను బహిరంగంగా అవమానించి మరోవైపు బీజేపీ మద్దతుదారుల మెప్పుకోసం కేసులు పెడుతూ రెండు వైపులా విద్వేష వ్యాఖ్యలు ఉన్నాయనేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
తనపై నమోదైన ఎఫ్ఐఆర్లో తాను చేసిన నేరం గురించి ప్రస్తావించలేదని అన్నారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ విషయంలో న్యాయవాదులతో మాట్లాడి సరైన సమయంలో దీటుగా బదులిస్తామని చెప్పారు. ఇలాంటి చర్యలతో తమను అణిచివేయలేరని స్పష్టం చేశారు. విద్వేష ప్రసంగాన్ని తప్పుపట్టడం, విద్వేష వ్యాఖ్యలు చేయడం ఒకటి కాదని పేర్కొన్నారు. కాగా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై ఢిల్లీ పోలీసులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో స్వామి యతి నర్సింగానంద్ పేరును కూడా పోలీసులు పొందుపరిచారు.
బహిష్కృత బీజేపీ నేత నూపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన నేపధ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక నూపుర్ శర్మపైనా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమెతో పాటు కాషాయ పార్టీ బహిష్కృత నేత నవీన్ జిందాల్, జర్నలిస్ట్ సవా నక్వీపైనా ఎఫ్ఐఆర్ నమోదైంది. నూపుర్ శర్మపై సెక్షన్ 153, సెక్షన్ 295ల కింద ఘర్షణలు ప్రేరేపించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయడం వంటి అభియోగాలు మోపారు. వివిధ వర్గాల ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడినందుకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్కు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రేటజిక్ ఆపరేషన్ (ఐఎఫ్ఎస్ఓ) విభాగం ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది.