న్యూఢిల్లీ, మార్చి 18: దేశీయంగా ఇండ్ల అమ్మకాల్లో రూ.45 లక్షలలోపు గృహాలకు డిమాండ్ పడిపోతున్నది. ఇదే సమయంలో రూ.75 లక్షలకుపైగా ధర కలిగిన ఇండ్లకు ఆదరణ పెరుగుతున్నది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్టైగర్ ‘రియల్ ఇన్సైట్ రెసిడెన్షియల్-వార్షిక రౌండ్-అప్ 2021’ పేరుతో తాజగా ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో రూ.45 లక్షల వరకు ధర ఉన్న ఇండ్ల అమ్మకాలు తగ్గిపోయాయని తేలింది. 2020తో పోల్చితే 2021 మొత్తం గృహ విక్రయాల్లో వీటి వాటా 48 శాతం నుంచి 43 శాతానికి దిగొచ్చింది. మరోవైపు రూ.75 లక్షలు, ఆపై ధర ఉన్న ఇండ్ల అమ్మకాలు 25 శాతం నుంచి 31 శాతానికి ఎగబాకాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై-ఎంఎంఆర్, చెన్నై, అహ్మదాబాద్, పుణె, కోల్కతా నగరాల్లో గతేడాది హౌజింగ్ సేల్స్ 13 శాతం పెరిగి 2,05,936 యూనిట్లకు పెరిగాయి. 2020లో 1,82,639 యూనిట్లుగానే ఉన్నాయి. రూ.45-75 లక్షల మధ్య ధర ఉన్న ఇండ్ల అమ్మకాలు 26 శాతం నుంచి 27 శాతానికి పెరిగితే, రూ.75 లక్షలు-కోటి శ్రేణి గృహ విక్రయాలు 9 శాతం నుంచి 11 శాతానికి ఎగబాకాయి. కోటి, ఆపై విలువైన ఇండ్ల అమ్మకాలు 16 శాతం నుంచి 20 శాతానికి ఎగిశాయి.
నిరుడు దేశంలో ఇండ్ల అమ్మకాలు పెరగడానికి పలు ప్రోత్సాహకాలూ కలిసొచ్చాయి. ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80ఈఈఏ కింద తొలిసారి ఇంటి కొనుగోలుదారులకు గృహ విలువ రూ.45 లక్షల వరకుంటే అదనంగా రూ.1.5 లక్షల పన్ను తగ్గింపు వర్తిస్తున్నది. పీఎంఏవై సబ్సిడీనీ పొందవచ్చు. ఇక గృహ రుణాలపై తగ్గిన వడ్డీరేట్లు కూడా ఇండ్ల కొనుగోళ్లను పెంచాయని హౌజింగ్.కామ్, ప్రాప్టైగర్.కామ్, మకాన్.కామ్ గ్రూప్ సీఈవో ధ్రువ్ అగర్వాల చెప్తున్నారు. కరోనా సంక్షోభంలోనూ చాలామంది ఇండ్ల కొనుగోలుకు ఆసక్తి కనబర్చారన్నారు. ఈ ఏడాది కూడా అమ్మకాలు మరింత పెరగవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పన్ను రిబేట్లు, స్టాంప్ డ్యూటీ రద్దు వంటివి ఇందుకు కలిసొస్తాయన్నారు.