చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్లో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. శనివారం కొత్తగా 13 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలో కరోనా బారిన పడిన వారి మొత్తం సంఖ్య 196కు పెరిగింది. కరోనా వ్యాప్తి కేంద్రంగా ఐఐటీ మద్రాస్ మారడం కలకలం రేపుతున్నది. అయితే కరోనా సోకిన విద్యార్థుల్లో చాలా మందికి ఎలాంటి లక్షణాలు లేవని అక్కడి అధికారులు తెలిపారు. కొందరికి మాత్రమే జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి స్వల్ప లక్షణాలున్నట్లు చెప్పారు.
కాగా, ఇప్పటి వరకు 7,300 నమూనాలను పరీక్షించగా 196 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలిందని ఐఐటీ మద్రాస్ అధికారులు తెలిపారు. కరోనా సోకిన వారిని ఐసొలేషన్లో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఐసొలేషన్ కాలం ముగిసి టెస్ట్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన 33 మంది విద్యార్థులను డిశ్చార్జ్ చేసినట్లు వివరించారు.
మరోవైపు ఐఐటీ మద్రాస్లో కరోనా బారిన పడిన విద్యార్థులకు క్యాంపస్లోనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉండటంతో వారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.