సుల్తాన్బజార్, డిసెంబర్ 5: పేద గుండెకు భరోసా కల్పించేందుకు ఉస్మానియా దవాఖానలో ఏర్పాటు చేస్తున్న క్యాథ్ల్యాబ్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆదివారం నిర్మాణ పనులను దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దవాఖానలో రూ.7 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న క్యాథ్ల్యాబ్( కార్డియాక్ కాథెటరైజేషన్ ల్యాబ్) పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రూ.80 లక్షల వ్యయంతో ఆక్సిజన్ కాన్సంట్రేషన్, అత్యాధునిక సిటీస్కాన్ యంత్రం, రూ.1.20 కోట్లతో ఎండోస్కోపీ యంత్రం, మైనర్ ఆపరేషన్ థియేటర్(ఎంఓటీ), రూ.18 లక్షలతో వైరల్ హైపటైటిస్ వార్డు, ఓపీ బ్లాక్ ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వారం రోజుల్లో అగ్నిమాపక కేంద్రం షెడ్డును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నట్లు చెప్పారు.