హైదరాబాద్, జనవరి 12: ఉద్యోగం ఉన్నప్పుడు జీతంలో కొంత దానం చేసిన చేతులవి.. కరోనాతో ఉద్యోగమే పోయింది. వ్యాపారం బాగున్నప్పుడు వేలకొద్దీ విరాళం ఇచ్చిన మనసులవి.. కరోనాతో వ్యాపారం కుంటుపడింది. కొందరిది సహాయం చేయలేని స్థితి, ఇంకొందరిది అనాథ, వృద్ధాశ్రమాలకు వెళ్లలేని పరిస్థితి. ఫలితంగా ఎన్నో సామాజిక రంగ సంస్థలు దాతృత్వ సేవలు అందించలేక చతికిలబడుతుంటే, మరికొన్ని అతికష్టం మీద నెట్టుకొస్తున్నాయి. ఇటీవల అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా జీవనోపాధి, ఆరోగ్యం, మానవ హక్కులు, లింగవివక్ష, మహిళాసంక్షేమం, బాలల సంక్షేమం తదితర విభాగాల్లో సేవలను అందిస్తున్న 107 స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అందులోని సిబ్బందిని ప్రత్యక్షంగా విచారించింది. సేవా కార్యక్రమాలపై కొవిడ్ ప్రభావం ఎలా ఉన్నది? సామాజిక రంగ సంస్థలు, అందులోని ఉద్యోగులు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు? ఏవిధంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు? తదితర అంశాలపై అధ్యయనం చేసి ఇటీవలే నివేదికను విడుదల చేసింది.
నిలిచిన విరాళాలు
కొవిడ్కు ముందు స్వచ్ఛంద సంస్థలు, ఆశ్రమాల్లో నిత్యం సందడి ఉండేది. పుట్టినరోజు, వివాహం తదితర శుభకార్యాల సందర్భంగా కొందరు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవారు. కొవిడ్తో ప్రస్తుతం చాలా మంది సేవా కార్యక్రమాలకు స్వస్తి పలికారు. వ్యాపారాలు కుంటుబడటంతో ఆర్థిక సాయం చేసేవారు కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు సతమతమవుతున్నాయి. కిరాయిలు, కరెంటు, నల్లా తదితర బిల్లులను కూడా కట్టలేని దుస్థితికి చేరుకొన్నాయని నివేదిక వెల్లడించింది.
ప్రణాళికలన్నీ తారుమారు
కొవిడ్తో సామాజిక రంగ సంస్థల ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. కొవిడ్ నిబంధనలతో కొన్ని సంస్థలు తమ ప్రోగ్రాములన్నింటినీ నిలిపేసి, కొవిడ్ బాధితులకు సత్వర ఉపశమ నం కలిగించే చర్యలపై దృష్టి సారించాయని నివేదిక తెలిపింది.
నిపుణుల కొరత
కరోనాతో అన్ని రంగాలు ఆన్లైన్ సేవలపై దృష్టి సారించాయి. స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే సామాజిక రంగ సేవలపై అవగాహన ఉండి డిజిటల్ టెక్నాలజీ పరిజ్ఞానం ఉన్న నిపుణుల కొరత తీవ్రంగా ఉన్నది. సిబ్బందికి ఆ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని నివేదిక పేర్కొన్నది. వలంటీర్లు అందుబాటులో లేకపోవటం సంస్థల కార్యకలాపాలకు అవరోధంగా నిలిచాయని రిపోర్ట్ వెల్లడించింది.
హైదరాబాద్కు చెందిన కుమార్ ప్రైవేట్ ఉద్యోగి. కరోనాకు ముందు తన పుట్టినరోజును అనాథ పిల్లలతో కలిసి జరుపుకొనేవారు. ఏటా అనాథాశ్రమానికి వెళ్లి పిల్లలతో గడిపేవారు. వాళ్లకు పుస్తకాలు, దుస్తులు, ఇతర వస్తువులు కొనిచ్చేవారు. కరోనా తర్వాత అనాథశ్రమానికి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఏదైనా సహకారం కావాలని అనాథాశ్రమం నుంచి ఫోన్ వస్తే ఆన్లైన్ ద్వారానే చెల్లిస్తున్నారు తప్ప పిల్లలకు సేవ చేయటం లేదు, వాళ్లతో పలుకరింపులూ లేవు.
వలంటీర్లు లేరు
కరోనాతో మాపై సామాజిక బాధ్యత మరింత పెరిగింది. కొత్తగా కొవిడ్ బాధితుల కోసం సహాయ కార్యక్రమాలను చేపడుతున్నాం. నిత్యం అన్నదానం చేస్తున్నాం. అయితే, వలంటీర్లు లేకపోవటంతో సరైన సమయానికి సేవా కార్యక్రమాలను నిర్వహించలేని దుస్థితి నెలకొన్నది.
– సోహైల్, సఖీనా ఫౌండేషన్, హైదరాబాద్