‘సార్…ఆకలేస్తుంది.. తినేందుకు డబ్బు ఇవ్వండి’..రెండు రోజులుగా తినలేదంటూ.. ఓ పదేండ్ల బాలుడు గచ్చిబౌలి డీఎల్ఎఫ్ వద్ద వచ్చిపోయే వారిని అడుగుతుంటే.. గమనించిన మాదాపూర్ ఆపరేషన్ స్మైల్ బృందం చేరదీసి.. వివరాలు తెలుసుకుంది. తన తండ్రి రూ. 500 చేతిలో పెట్టి.. ఎక్కడికైనా వెళ్లిపొమ్మన్నాడని అతడు చెప్పడంతో బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చగా, చదువుకోమంటే తమ కుమారుడు ఇంటి నుంచి పారిపోయినట్లు వారు చెప్పారు. దీంతో బాలుడు ఒత్తిడిలో ఉన్నట్లు గుర్తించి.. కౌన్సెలింగ్ ఇచ్చి..బుద్ధిగా చదువుకోమని సూచించారు. అలాగే రెండేండ్ల పాపతో భిక్షాటన చేస్తున్న ఇద్దరు బాలికలకు అండగా నిలిచి.. కష్టాల నుంచి విముక్తి కల్పించింది. ఓ బాల్య వివాహాన్ని అడ్డుకుంది. నవంబర్ నెలలో మొత్తం 29 మందిని ఆపరేషన్ స్మైల్ బృందం కాపాడింది. వారి మోముల్లో చిరునవ్వులు నింపింది.
గండిమైసమ్మ చౌరస్తా వద్ద రెండేండ్ల పాపతో భిక్షాటన చేస్తున్న ఇద్దరు బాలికలను బాలానగర్ ఆపరేషన్ స్మైల్ బృందం సభ్యులు చేరదీసి వివరాలను సేకరించారు. భిక్షాటనకు తమ తల్లిదండ్రులే పంపిస్తున్నారని.. వారి దగ్గర ఉండటం మాకు ఇష్టం లేదని, చదువు అంటే ఇష్టమని చెప్పారు. అంతేకాకుండా తమ రెండేండ్ల చిన్నారికి మద్యం, కల్లు తాగిపించి మత్తులో ఉండేలా చేసి భిక్షాటన చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆపరేషన్ స్మైల్ టీం ఈ ముగ్గురిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ , డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారుల సహకారంతో షెల్టర్ హోంకు తరలించి చదువుకునేందుకు ఏర్పాట్లను చేశారు.
బంజారాహిల్స్, డిసెంబర్ 9: డబ్బులకు ఆశపడి కన్నకూతురి చేత భిక్షాటన చేయించడంతో పాటు వ్యభిచారం చేయించేందుకు యత్నిస్తున్న మహిళపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానగర్లో నివాసముంటున్న ఓ మహిళ తన కూతురు(16)తో కొంతకాలంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భిక్షాటన చేయిస్తున్నది. కాగా, తల్లి ఒత్తిడిని భరించలేని ఆ బాలిక ఈ నెల 6న బస్సులో ఖమ్మం పారిపోయింది. అక్కడ బస్స్టాండ్లో అనుమానాస్పద స్థితిలో తచ్చాడుతుండగా, చైల్డ్లైన్ సిబ్బంది రక్షించి.. రెస్క్యూ హోమ్కు తరలించారు. బాలికను విచారించగా విషయం బయటపడింది. ఆమె తల్లి భిక్షాటన చేయించడంతో పాటు వ్యభిచారం కూడా చేయించేందుకు యత్నిస్తున్నట్లు తెలుసుకున్న ఖమ్మం జిల్లా చైల్డ్లైన్ అధికారులు హైదరాబాద్లోని చైల్డ్లైన్ కో అర్డినేటర్ వేదల సాల్మన్రాజుకు సమాచారం అందించారు. ఈ మేరకు సాల్మన్రాజు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితురాలిపై హ్యూమన్ ట్రాఫికింగ్తో పాటు 75, 76 ఆఫ్ జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితురాలి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మాదాపూర్ ఆపరేషన్ స్మైల్ టీంకు ఓ 16 ఏండ్ల బాలిక ఫోన్ చేసి.. మా అమ్మనాన్నలు బలవంతంగా పెండ్లి చేస్తున్నారని, ఆపాలని విజ్ఞప్తి చేసింది. రంగంలోకి దిగిన మియాపూర్ షీ టీమ్స్, మాదాపూర్ ఆపరేషన్ స్మైల్ టీం సభ్యులు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు.
నవంబర్ నెలలో మొత్తం 24 మంది బాలురు, 5 మంది బాలికలను కాపాడింది ఆపరేషన్ స్మైల్. తల్లిదండ్రుల ఆదరణ కరువై.. వారిని పోషించేందుకు రోడ్లపై వచ్చిన బాలబాలికలను కాపాడి షెల్టర్ హోంకు తరలించింది . బాలబాలికలతో వెట్టిచాకిరీ, భిక్షాటన, రోజు వారి కూలీగా పనిచేయించుకుంటే కఠిన చర్యలు ఉంటాయని సైబరాబాద్ షీ టీమ్స్ డీసీపీ అనసూయ హెచ్చరించారు. వెట్టిచాకిరిపై సమాచారం ఉంటే వెంటనే 7901115474కు తెలియజేయాలని సూచించారు.