విజయవాడ: రాష్ట్రంలోని 8 ప్రధాన ఆలయాల్లో ఈ నెల 20 నుంచి ఆన్లైన్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యే ఆలయాల్లో.. కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ దేవాలయం, అన్నవరం, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం, సింహాచలం, వాడపల్లి, అయినవిల్లి ఆలయాలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. మరో 10 దేవాలయాల్లో ఆన్లైన్ సేవలను త్వరలో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు.
దసరా ఉత్సవాల ఏర్పాట్లపై త్వరలో విజయవాడ కనకదుర్గ ఆలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వీఐపీ బ్రేక్ దర్శనానికి ప్రత్యేక టైమ్ స్లాట్లను కేటాయించారని, ఉదయం 3 నుంచి 5 గంటల వరకు, ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. వీఐపీ టికెట్ ధర రూ.500 అని, 1400 వీఐపీ టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఉచిత దర్శనం, రూ.300 టిక్కెట్ దర్శనం భక్తులను ఘాట్ రోడ్డు గుండా అనుమతిస్తామని తెలిపారు. సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన మంత్రి.. 45 నిమిషాల్లోనే భక్తులకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు దసరా ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.