న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు గట్టి షాకే తగిలింది. ఏకంగా లక్ష కోట్ల రూపాయల విలువైన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నోటీసులు జారీ అయ్యాయి మరి. ‘ఇప్పటిదాకా ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికార వర్గాల ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన నోటీసులు ఇవ్వడం జరిగింది.’ అని ఓ సీనియర్ అధికారి బుధవారం తెలియజేశారు. పన్ను ఎగవేతలకుగాను ఈ షోకాజ్ నోటీసులను ఇచ్చామన్నారు. కాగా, ఈ నెల 1 నుంచి దేశంలోకి ఎన్ని విదేశీ గేమింగ్ కంపెనీలు వచ్చాయన్న వివరాలేవీ ఇంకా లేవన్నారు. అక్టోబర్ 1 నుంచి భారతీయ మార్కెట్లోకి ప్రవేశించే విదేశీ గేమింగ్ కంపెనీలు దేశంలో నమోదు కావడాన్ని తప్పనిసరి చేస్తూ జీఎస్టీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసిన సంగతి విదితమే.
ఆన్లైన్ గేమింగ్ వేదికలపై జరిగే బెట్టింగులకు దాని పూర్తి విలువ ఆధారంగా 28 శాతం జీఎస్టీ వర్తిస్తుందని ఈ ఏడాది ఆగస్టులో మోదీ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి జీఎస్టీ షార్ట్ పేమెంట్ కోసం సమాచార నోటీసైనా లేదా షోకాజ్ నోటీసైనా ఏదో ఒకటి గేమింగ్ కంపెనీలు అందుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటిదాకా ఇలా సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన పన్ను ఎగవేత నోటీసులను ఆయా కంపెనీలకు పంపించినట్టు సదరు సీనియర్ అధికారి స్పష్టం చేశారు.
జీఎస్టీ అధికార వర్గాలు జారీ చేసిన ఈ డిమాండ్ నోటీసులపై ఆయా ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాయి. నైపుణ్యం ఆధారంగా నడిచే ఈ ఆటలకు 18 శాతం జీఎస్టీని చెల్లిస్తున్నామని హైకోర్టులకు కంపెనీలు ఈ సందర్భంగా వివరిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమకు అందిన పన్ను ఎగవేత నోటీసులపై డెల్టా కార్ప్.. బాంబే హైకోర్టులో సవాల్ చేసింది. తాము, తమ అనుబంధ సంస్థలు దాఖలు చేసిన రిట్ పిటీషన్లను హైకోర్ట్ ఆఫ్ బాంబే ఎట్ గోవా సోమవారం పరిశీలించిందని మంగళవారం డెల్టా కార్ప్ పేర్కొన్నది. అలాగే కోర్టుకు తెలియపర్చకుండా జీఎస్టీ అధికారులు ఏ రకమైన తుది నిర్ణయానికి రావద్దని, ఆయా కంపెనీలపై ఎటువంటి చర్యలకు దిగవద్దని కూడా హైకోర్టు స్పష్టం చేసినట్టు డెల్టా కార్ప్ తెలిపింది. మరోవైపు ఓ కంపెనీకి అనుకూలంగా కర్ణాటక హైకోర్టు తీర్పునివ్వడంతో దీన్ని సవాల్ చేస్తూ ఈ ఏడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
గేమింగ్ కంపెనీలకు జారీ చేసిన దాదాపు లక్ష కోట్ల రూపాయల పన్ను ఎగవేత నోటీసుల్లో అత్యధికంగా డ్రీమ్11కే వెళ్లడం గమనార్హం. ఈ గేమింగ్ కంపెనీ తమకు రూ.40,000 కోట్ల షోకాజ్ నోటీసులు అందినట్టు ప్రకటించింది. అలాగే డెల్టా కార్ప్ వంటి క్యాసినో ఆపరేటర్లు, గేమింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడర్లు.. జీఎస్టీ అథారిటీల నుంచి రెండు విడుతల్లో మొత్తం రూ.23,000 కోట్ల నోటీసులను అందుకున్నారు. ఇక నిరుడు సెప్టెంబర్లో గేమ్స్క్రాఫ్ట్కు జీఎస్టీ ఎగవేసిందని ప్రత్యేకంగా రూ.21,000 కోట్ల షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.