హైదరాబాద్, నవంబర్ 20: తెలంగాణ రాష్ట్రం దేశీ య పెట్టుబడుల్నే కాదు, అంతర్జాతీయ సంస్థల్నీ ఆకర్షించడంలో దూసుకుపోతున్నది. పలు దేశీ, విదేశీ కంపెనీలు ఇక్కడ కార్యాలయాలను, అభివృద్ధి పరిశోధనా కేంద్రాలను, ప్లాంట్లను నెలకొల్పిన నేపథ్యంలో మరో అంతర్జాతీయ సంస్థ తెలంగాణలో ప్లాంటు ఏర్పాటుకు సిద్ధమయ్యింది. బ్రిటన్కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు, సైకిళ్ల తయారీ దిగ్గజం వన్ మోటో ఈ రాష్ట్రంలో ప్లాంటు నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని.. వన్ మోటో ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్ను ఇండియాలో ప్రారంభించిన సందర్భంగా వన్ మోటో వ్యవస్థాపకులు వెల్లడించారు. తెలంగాణలో తయారీ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో తాము జరుపుతున్న చర్చలు తుదిదశలో ఉన్నాయని ఆన్నారు. వన్ మోటో గ్లోబల్ తన ఇండియా ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటుచేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. వర్చువల్గా జరిగిన బుకింగ్ ప్రారంభ కార్యక్రమంలో వన్ మోటో గ్లోబల్ సీఈవో అడమ్ రిట్జ్వే, వన్ మోటో ఇండియా వ్యవస్థాపకులు ముజామ్మిల్ రియాజ్, సమీర్ మొయిద్దీన్లు సంస్థ కార్యకలాపాల్ని వివరించారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బ్యాటరీ ఛార్జింగ్/స్వాపింగ్ నెట్వర్క్ను నెలకొల్పుతున్నామన్నారు. వచ్చే కొద్దినెలల్లో మరిన్ని స్కూటర్ మోడల్స్ను ప్రవేశపెడతామని, హైదరాబాద్, బెంగళూరు, మంగళూరు, ముంబైల్లో ఎక్స్పీరియన్స్ హబ్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆటోమోటివ్ డిపార్ట్మెంట్ అధికారులు, బ్రిటిష్ హైకమిషన్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రత్యేక సందేశం ఇచ్చారు.