Road accident | తిమ్మాపూర్, ఆగస్టు8 : కోటి ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని అఖిల ధర్మపురి మండలానికి చెందిన రాజు అనే యువకుడితో మూడు రోజుల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో ఇటీవల డిగ్రీ పూర్తి చేసిన అఖిల, పీజీ విద్యను అభ్యసించేందుకు తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరీ ఇంజనీరింగ్ కళాశాలలోని అయాన్ డిజిటల్ జోన్ లో పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు హాజరైంది.
పరీక్ష ముగించుకొని తిరిగి భర్త రాజుతో కలిసి బైక్ పై కరీంనగర్ వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దంపతులిద్దరూ కింద పడిపోయారు. అఖిల రోడ్డుపై మధ్యలో పడిపోవడంతో వెనుక నుండి వచ్చిన లారీ ఆమె తలపై నుండి వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎల్ఎండీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి అఖిల మృతదేహాన్ని కరీంనగర్ తరలించారు. మూడు రోజుల క్రితమే పెళ్లయిన అఖిల జీవితం అర్ధాంతరంగా ముగిసింది అని తెలుసుకున్న పలువురు స్థానికులు, ప్రయాణికులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు