న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత వాగ్ధానాల అంశం గురించి ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశాన్ని నిపుణుల కమిటీ పరిశీలించాలని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. అఖిల పక్ష భేటీలో దీన్ని చర్చించాలని ఆయన అన్నారు. అయితే ఇవాళ తొలిసారి జరిగిన లైవ్ స్ట్రీమింగ్లో ఈ కేసును విచారించారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఉచిత వాగ్ధానాలు ఇస్తున్నాయని, ఆ పార్టీల గుర్తింపు ఎత్తివేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. ప్రజాస్వామ్యంలో అసలైన శక్తి ఓటరు వద్దే ఉంటుందని, వాళ్లే పార్టీలను, అభ్యర్థులను ఎంపిక చేస్తారని సీజే రమణ అన్నారు. అయితే ఈ అంశాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సీజే అన్నారు. ఈ అంశంపై ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు సీజే గుర్తు చేశారు.
తాము చేస్తున్న వాగ్ధానాలు ఉచితాలు కాదు అని, అవి సంక్షేమ పథకాలు అని అనేక రాజకీయ పార్టీలు కోర్టులో వాదించాయి. అయితే ఇలాంటి కేసుకు సంబంధించిన 2013 నాటి తీర్పును పరిశీలించనున్నట్లు కోర్టు తెలిపింది. ఉచితాల అంశంలోని సంక్లిష్టత నేపథ్యంలో కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.