న్యూఢిల్లీ : భారత్లో కరోనా విజృంభిస్తున్నది. ఇటీవల ఓ వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నది. ఈ క్రమంలో అప్రమత్తమైన కేంద్రం ఇటీవల బూస్టర్ డోస్ టీకాల పంపిణీ ప్రారంభించింది. ఈ క్రమంలో బూస్టర్ డోస్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization), భారత్కు చెందిన పలువురు నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. కొత్త వేరియంట్కు వ్యతిరేకంగా పదే పదే వ్యాక్సిన్ ఇవ్వడం సమర్థవంతమైన వ్యూహం కాదని, దానికి బదులుగా కొత్త టీకా ఇవ్వడం ద్వారా ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా ఉత్తమ రక్షణ అందిస్తుందని డబ్ల్యూహెచ్వో తెలిపింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ను కేవలం బూస్టర్ డోస్తో ఆపలేమని, వేరియంట్ అందరికీ సోకుతుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ, ఐసీఎంఆర్ (ICMR) సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ జయప్రకాష్ ములియిల్ పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్ ఎప్పుడు సోకిందో.. 80శాతాని కంటే ఎక్కువ మందికి తెలియదని, అయితే ప్రస్తుతం కరోనా అంత భయంకరంగా లేదని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఏ వైద్య సంస్థ బూస్టర్ డోస్ను సిఫారసు చేయలేదని, ఈ బూస్టర్ డోస్ అంటువ్యాధి సహజ ప్రక్రియను ఆపదు. ఏ ప్రభుత్వ సంస్థ బూస్టర్ను సిఫారసు చేయలేదు. నాకు సంబంధించినంత వరకు ఇది ప్రిస్క్రిప్షన్ డోస్ అని తెలుసు’ అన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారు రెండు డోసుల తర్వాత వైరస్తో ఇన్ఫెక్షన్తో పోరాడే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలేదని, నివేదికల కారణంగా.. ప్రికాషన్ డోస్ను సూచిస్తున్నారన్నారు.
కరోనా పరీక్షలపై మాట్లాడుతూ.. కరోనా రోగితో సంబంధం లేకుండా లక్షణాలు ఉన్న వ్యక్తిని పరీక్షించడం కూడా మంచిది కాదని, ఇన్ఫెక్షన్ రెండు రోజుల్లో, అంటే.. పరీక్ష వచ్చే వరకు రెట్టింపు అవుతుందన్నారు. వైరస్ ఉనికిని గుర్తించే సమయానికి, ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి చాలా మందికి వ్యాప్తి చేస్తాడన్నారు. లాక్డౌన్పై మాట్లాడుతూ మనం చాలాకాలం పాటు ఇండ్లకు తాళం వేయలేమన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే తక్కువ ప్రభావం చూపుతుందన్నారు. 85శాతం భారత్లో వ్యాక్సిన్ ప్రవేశపెట్టడానికి ముందే భారతీయు మహమ్మారి బారినపడ్డారన్నారు. కాబట్టి భారతదేశంలో వ్యాక్సిన్ మొదటి డోస్ వాస్తవానికి మొదటి బూస్టర్ డోస్ అని, ఎందుకంటే.. భారతీయుల్లో వైరస్ కారణంగా రోగనిరోధక శక్తి సహజంగానే పుట్టిందని వివరించారు.