హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఆయిల్పామ్ సాగులో తెలంగాణ రాష్ట్రం దేశంలో లీడర్గా మారిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారు. అతి త్వరలోనే ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం, దిగుబడిలో రాష్ట్రం నంబర్వన్గా అవతరిస్తుందని చెప్పారు. ఆయిల్పామ్ సాగును పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు బాగున్నాయని అభినందించారు. రాష్ట్రప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ వంట నూనెల మిషన్, ఆయిల్పామ్ బిజినెస్ సమ్మిట్ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు.
తెలంగాణలో ప్రస్తుతం 11 ఆయి ల్ ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. 26 జిల్లాలను ఆయిల్పామ్ సాగుకు రాష్ట్రప్రభుత్వం ఎంపికచేసిందని గుర్తుచేశారు. దేశంలో ప్రస్తుతం 3 లక్షల హెక్టార్లలోనే ఆయిల్పామ్ సాగవుతున్నదని, దానిని 28 లక్షల హెక్టార్లకు పెంచేందుకే ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్-ఆయిల్పామ్’ (ఎన్ఎంఈవో-ఓపీ)ను ప్రారంభించామని చెప్పారు. ఆయిల్పామ్ సాగులో రాష్ట్ర వ్యవసాయశాఖ లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయిల్పామ్ బిజినెస్ సమ్మిట్ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వాన్ని, ఉద్యానశాఖను తోమర్ అభినందించారు.
వ్యవసాయ రూపురేఖలు మార్చిన కేసీఆర్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేపట్టిన విప్లవాత్మక చర్యలతో గత ఏడేండ్లలో తెలంగాణలో వ్యవసాయరంగం రూపురేఖలు మారిపోయాయని నిరంజన్రెడ్డి తెలిపారు. 2014-15లో రాష్ట్రంలో 12.2 కోట్ల ఎకరాలున్న సాగు, 2020-21లో 2.03 కోట్ల ఎకరాలకు పెరిగిందని తెలిపారు. 2014-15లో ధాన్యం ఉత్పత్తి 68.2 లక్షల టన్నులుంటే, 2020-21లో 259.2 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు. పెట్టుబడి సాయం కోసం రైతుబంధు కింద రైతులకు ఏటా ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పారు. ఈ సీజన్తో రైతుబంధు పంపిణీ రూ.50 వేల కోట్లు దాటుతుందని వెల్లడించారు.
ఆయిల్పామ్ విత్తనాల నాణ్యత పరిశీలనకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సూచించారు. ఆయిల్పామ్ ఉత్పత్తిలో ఇండోనేషియా, మలేషియా తర్వాత తెలంగాణ రాష్ట్రం హబ్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయిల్పామ్ సాగుకు ఇప్పటికే 54 లక్షల మొక్కలు దిగుమతి చేసుకొన్నట్టు వివరించారు. సమావేశంలో కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాశ్చౌదరి, కేరళ వ్యవసాయశాఖ మంత్రి పీ ప్రసాద్, ఐకార్ డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఆయిల్పామ్ కంపెనీల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 30 లక్షల ఎకరాలకు పెంచండి: మంత్రి నిరంజన్రెడ్డి
డిమాండ్ను ముందుగానే గ్రహించి కేంద్రప్రభుత్వం కన్నా ముందే తెలంగాణలో ఆయిల్పామ్ సాగుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఆయిల్పామ్ సాగుకు తెలంగాణ అత్యంత అనుకూలమైనదని కేంద్ర సంస్థలే నిర్ధారించాయని చెప్పారు. రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణ లక్ష్యాన్ని వచ్చే ఐదేండ్లలో కేంద్రం 1.12 లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 30 లక్షల ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నదని వెల్లడించారు.
ఈ లక్ష్య సాధనకు కేంద్రం సహకరించాలని కోరారు. ఆయిల్పామ్ గెల టన్నుకు రూ.15 వేల కనీస మద్దతు ధరను నిర్ణయించి రైతులను ప్రోత్సహించాలని విన్నవించారు. ఇక ఆయిల్పామ్ సాగుకు తప్పనిసరి అయిన బిందుసేద్యానికి యూనిట్కు కేంద్రం ఇస్తున్న సబ్సిడీ మరింత పెంచాలని కోరారు. దేశంలో అత్యధిక నూనె ఉత్పత్తి శాతం తెలంగాణలోనే ఉన్నదని, టన్ను గెల నుంచి 19.22 శాతం నూనె ఉత్పత్తి అవుతున్నదని వివరించారు.