ఉస్మానియా యూనివర్సిటీ: ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష (ఆఫ్లైన్) తరగతులను నిర్వహించనున్నారు. తరగతుల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసిన నేపథ్యంలో ఇఫ్లూ వీసీ, యూజీసీ సభ్యుడు ప్రొఫెసర్ ఇ. సురేశ్కుమార్ అధ్యక్షతన అకాడమిక్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యక్ష తరగతులను దశల వారీగా ప్రారంభించి, విద్యార్థులను క్యాంపస్లోకి అనుమతిస్తామని చెప్పారు.
మొదటి దశలో అన్ని విభాగాలలో ఎంఏ చదువుతున్న విద్యార్థులకు క్యాంపస్లోకి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. దీనితో పాటు విదేశీ విద్యార్థులను సైతం వర్సిటీలోకి అనుమతిస్తామని ప్రకటించారు. ప్రస్తుతానికి యూజీ, పీహెచ్డీ విద్యార్థుల తరగతులు ఆన్లైన్ విధానంలోనే కొనసాగుతాయన్నారు. తరువాతి దశల్లో వారిని కూడా క్యాంపస్లోకి అనుమతిస్తామని చెప్పారు.
క్యాంపస్లోకి విద్యార్థులు వచ్చే ముందుగా 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకుని, సదరు రిపొర్టుతో రావాలని సూచించారు. ఆ రిపోర్టు నకిలీది తేలిన పక్షంలో, అది తీసుకువచ్చిన వారిపై కఠిన క్రమశిక్షణ చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఇఫ్లూతో పాటు షిల్లాంగ్, లక్నోలలోని ప్రాంతీయ కేంద్రాలలో సైతం అధ్యాపకులంతా తప్పనిసరిగా ఒకటవ తేదీ నుంచి తరగతులకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు.