హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరంలో భారీగా కొలువులను భర్తీచేసేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. వివిధ ప్రభుత్వశాఖల్లోని ఖాళీల లెక్కలు తీసే పని చురుకుగా సాగుతున్నది. ఇప్పటికే గుర్తించిన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. మొత్తంగా లక్ష ఉద్యోగాలు భర్తీచేసే అవకాశం ఉన్నదని తెలిసింది. అన్ని శాఖల్లో ఇప్పటికే దాదాపు 60 వేల పైచిలుకు ఖాళీలను ఆర్థిక శాఖ గుర్తించినట్టు అధికారులు తెలిపారు.
పూర్తిస్థాయిలో ఉద్యోగుల కేటాయింపులు పూర్తయ్యి, జిల్లాలు, శాఖాధిపతుల కార్యాలయాల నుంచి సమాచారం వస్తే మరో 40 వేల ఖాళీలు అదనంగా చేరే అవకాశం ఉన్నది. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ ఖాళీలన్నింటినీ క్రోడీకరించి శాఖలు, జిల్లాల వారీగా వివరాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు పంపనున్నది. సీఎం అనుమతి రాగానే వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉన్నది. సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత నూతన జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఆ వెంటనే రాష్ట్రప్రభుత్వం దానిని అమల్లోకి తెచ్చి ఉద్యోగుల కేటాయింపులపై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది.
చివరిగా స్పౌజ్ కేసులు, అప్పీళ్ల కేసులకు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈ ప్రక్రియ ఒకటిరెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. దీంతో ఉద్యోగ ఖాళీల తుది జాబితాపై అధికారులు దృష్టిపెట్టారు. జిల్లాలవారీగా పోస్టులు ఎన్ని ఉన్నాయి? ఉద్యోగుల కేటాయింపుతో ఎన్ని పోస్టులు భర్తీ అయ్యాయి? ఎన్ని ఖాళీగా ఉన్నాయన్న వివరాలను జిల్లాల కలెక్టర్లు లెక్కలు తీస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ రెండుమూడు రోజుల్లో ఆర్థికశాఖకు పంపే అవకాశం ఉన్నది.
వీటితోపాటు శాఖాధిపతుల కార్యాలయాల నుంచి ఖాళీల వివరాలు రాగానే నివేదిక రూపంలో సీఎం కేసీఆర్కు పంపుతారు. సీఎం అనుమతితో టీఎస్పీఎస్సీ, ఇతర రిక్రూట్మెంట్ బోర్డులు వరుస నోటిఫికేషన్లు విడుదల చేయనున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఇప్పటికే 1,32,899 పైచిలుకు ఉద్యోగాలు భర్తీచేసింది. ఇందులో టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసినవే 30,594 ఉద్యోగాలున్నాయి.