హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ దేశంలోనే అగ్రగామిగా అవతరించింది. ఇప్పటివరకు టాప్లో ఉన్న బెంగళూరును వెనక్కి నెట్టి దేశంలోనే తొలిసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకొన్నది. కమర్షియల్ రియల్ ఎస్టేట్ (సీఆర్ఈ) విభాగంలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్), ముంబై, పుణె నగరాలను హైదరాబాద్ అధిగమించినట్టు ‘ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్’ పత్రిక వెల్లడించింది.
ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో హైదరాబాద్ 32 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో వివిధ కంపెనీలు ఇప్పటికే 25 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని బుక్ చేసుకొన్నాయి. ఆసియా ఖండంలోని నగరాలు వాణిజ్య స్థలాల మార్కెట్లో మెరుగైన వృద్ధిని నమోదు చేస్తున్నాయని, వీటిలో హైదరాబాద్ ముందు వరుసలో ఉన్నదని ఆఫీస్ స్పేస్ సేవల సంస్థ ‘కొలియర్స్’ దక్షిణ భారత విభాగం మేనేజింగ్ డైరెక్టర్ అర్పిత్ మెహ్రోత్రా స్పష్టం చేశారు. ఆఫీసు స్పేస్ విభాగంలో డిమాండ్-సరఫరా పరంగా హైదరాబాద్ అత్యంత స్థిరమైన నగరంగా నిలిచిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలతోపాటు హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యంగా ఉండటం, మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ను స్థిరంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టులను అమలు చేస్తున్నది. దీంతో యాపిల్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభించి ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్నాయి.