తుంగతుర్తి, మార్చి 29 : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిందని, కాళేశ్వరం ప్రాజెక్టును వృథాగా మార్చి ఎస్సారెస్పీ ఆయకట్టును ఎడారిలా చేశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు. తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి, సింగారంతండా, మొండికుంట తండాలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్పై అక్కసుతో కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టును నిష్ప్రయోజనం చేశారని మండిపడ్డారు. నీటిని ఎత్తిపోసి కష్ట కాలంలో ఉన్న రైతులకు ఇవ్వాలన్న కనీస సోయి ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. నేడు ఏ గ్రామానికి వెళ్లినా నీళ్లు లేక ఎండిన పంట పొలాలతో రైతులు బోరున విలపిస్తున్నారని, ఎండిన పంటలను మంత్రులు గానీ, ఎమ్మెల్యేలుగానీ పరిశీలించకపోవడం దారుణని తెలిపారు. మంత్రులకు దమ్ముంటే రైతుల వద్దకు వెళ్లి ఎండిన పంటల వివరాలను తెలుసుకోవాలన్నారు. ప్రకృతి తెచ్చిన కరువు కంటే పాలకుల నిర్లక్ష్యం, అవగాహనా రాహిత్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మీద కోపంతో సాగునీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ ఫేజ్ -2 కింద సాగు నీరు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి రైతులను మోసం చేసిందని, 15రోజులు నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండిపోయాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోస్తే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. తుంగతుర్తి మండలంలో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, ప్రతి రైతుకు ఎకరాకు రూ.25వేల నష్ట పరిహారం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు రేవంత్ సర్కారు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ, పంటలకు రూ.500 బోనస్, పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇవ్వాలన్నారు. వారి వెంట బీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్బాబు, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, వైస్ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, ఎంపీటీసీ కవి, నాయకులు ఎస్ఏ రజాక్, సోమశేఖర్గౌడ్, గుండగాని రాములు, సురేశ్గౌడ్, కల్లెట్లపల్లి ఉప్పలయ్య, రఘునందన్రెడ్డి, శంకర్నాయక్, మామిడి వెంకన్న ఉన్నారు.