చెన్నై: భారత గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారికకు చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అసభ్య సందేశాలతో కూడిన లేఖను హారికతో పాటు మరికొంత మంది చెస్ ప్లేయర్లకు పంపడం సంచలనం కల్గించింది. గత నవంబర్లో గ్రాండ్ స్విస్ టోర్నీ కోసం లాత్వియాకు వెళ్లగా తమకు లేఖలు అందాయని హారిక పేర్కొంది. ఈ ఘటనపై ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ ‘రిగాలో నా పేరిట ఓ లేఖ వచ్చింది. ఈ విషయం గ్రాండ్ స్విస్ టోర్నీ ఆఖరి రోజు వరకు నాకు తెలియదు. నేను ఆ లేఖను తెరవలేదు. దీనిపై ఫిడే వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. లాత్వియా పోలీసులు తీవ్రంగా పరిగణించారు. దీనిపై ముమ్మర దర్యాప్తు జరుగుతున్నది. ఈ విషయంలో టోర్నీ నిర్వాహకులు, ఫిడే సమర్థంగా పని చేశారు’ అని హారిక తెలిపింది. కాగా ఈ విషయాన్ని రష్యన్ మీడియా కూడా ధ్రువీకరించింది. ‘గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అసభ్యకర.. అశ్లీల వస్తువులతో కూడిన కవర్లు ప్లేయర్ల హోటల్ గదులకు చేరాయి. మొత్తం 15 మంది క్రీడాకారిణులకు ఆ కవర్లు అందాయి’ అని రష్యా మీడియా తెలిపింది.