బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చేశారు దేవ్లీనా. వ్యాపారంలో, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను డేటా అనలైటిక్స్ సాయంతో పరిష్కరించాలని ఆమె ఆలోచన. తన లక్ష్యాలకు అనుగుణంగానే ‘న్యూమర్ 8’ అనే డేటా అనలైటిక్స్ సంస్థను నెలకొల్పారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తరఫున సముద్ర వాతావరణంపై అధ్యయనం చేస్తున్నప్పుడు.. చేపలు పట్టేవారి జీవితాలను దగ్గరగా గమనించారు.
దళారులు, వడ్డీ వ్యాపారుల బారినపడకుండా మత్స్యకారులకు తనవంతుగా ఏదైనా చేయాలని అనుకున్నారు. దానికోసం ఉపగ్రహ సమాచారాన్ని వినియోగించుకోవాలని భావించారు. అందులో భాగంగానే.. మత్స్యకారులకు అన్ని వేళలా, అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు ‘ఓఫిష్’ అనే యాప్ను రూపొందించారు. చేపల వేటకు సంబంధించిన సూచనలు, మార్కెట్ అనుసంధానం, బీమా లాంటి వివరాలు ఇందులో ఉంటాయి. ఈ యాప్కు ఇప్పటికే ఏడువేల మంది యూజర్లు ఉన్నారు. త్వరలోనే ‘న్యూమర్ 8’ సంస్థ మత్స్యకారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పిస్తూ సముద్ర నాచు సాగులోకి అడుగుపెట్టనుంది.