హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): దేశ భవిష్యత్తు, 130 కోట్ల మంది ప్రజల భద్రత యువ ఐపీఎస్ అధికారుల బాధ్యత అని జాతీయ భద్రతా సలహాదారు అజిత్దోవల్ పేర్కొన్నారు. సర్ధార్ వల్లభ్భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్ అధికారుల పాసింగ్ఔట్ పరేడ్ను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అజిత్దోవల్ 132 మంది ఐపీఎస్, 17 మంది ఫారిన్ సర్వీసెస్ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ సమయంలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన ట్రైనీ ఆఫీసర్లకు ట్రోఫీలు అందజేశారు.
అనంతరం క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడారు. దేశ భవిష్యత్తు పోలీసుల చేతుల్లో ఉందని చెప్పారు. ఐపీఎస్లు కేవలం చట్టాలను అమలు చేసేందుకే నియమితులుకాలేదని, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కూడా వారి ప్రథమ కర్తవ్యం అని చెప్పారు. దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇతర ప్రభుత్వ విభాగాలతో పోలీసులు కలిసి పనిచేయాలని అన్నారు. దేశ అంతర్గత భద్రత సక్రమంగా లేకపోతే ఏ దేశమూ అభివృద్ధి చెందలేదని అన్నారు.
భవిష్యత్తు ప్రమాదాలను ముందస్తుగానే ఊహిస్తూ అందుకు సన్నద్ధులుకావాలని పిలుపునిచ్చారు. 1948 నుంచి 5,700 మంది ఐపీఎస్లను ఈ అకాడమీ తీర్చిదిద్దిందని చెప్పారు. పరేడ్ కమాండర్ డాక్టర్ దర్పన్ అహ్లువాలియా, ఐపీఎస్ క్యాడెట్ల కవాతు ప్రదర్శన అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అతుల్ కర్వాల్, ఎన్పీఏ అధికారులు, యువ ఐపీఎస్ అధికారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.