తిరుమల : తిరుమలలోని శ్రీవారికి ఓ ఎన్ఆర్ఐ భక్తుడు భారీ విరాళాన్ని టీటీడీ అధికారులకు అందజేశారు. అమెరికాలో నివాసముంటున్న డేగా వినోద్ కుమార్, రాధికారెడ్డి కోటీ రూపాయల డీడీని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ నిధులు టీటీడీ నిర్వహిస్తున్న స్విమ్స్ ఆస్పత్రికి వినియోగించాలని దాతలు కోరారు. బెంగుళూరు కే.ఆర్ పురానికి చెందిన మునిరాజ కుటుంబ సభ్యులు టీటీడీకి రూ. 30 లక్షల విలువ గల 600గ్రాముల బంగారంతో తయారు చేసిన చెవి దిద్దులు అందజేశారు.
తిరుమల భక్తులతో కిటికిటలాడుతుంది. కొండపై ఉన్న కంపార్టుమెంట్లు నిండి ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలైన్లలో నిలిచి ఉన్నారు. వీరికి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు . నిన్న స్వామివారిని 72,216 మంది భక్తులు దర్శించుకోగా 32,338 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.65 కోట్లు వచ్చిందని వెల్లడించారు.