సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఇంటి అద్దె పేరుతో 15 రోజుల కిందట సైబర్ నేరగాళ్లు రూ.2 లక్షలు కాజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోయిన డబ్బులను మంగళవారం తిరిగి బాధితుల ఖాతాలో జమ చేపించారు. దీంతో ఆ దంపతులు సంతోషంతో హైదరాబాద్ సైబర్ఠాణాకు వచ్చి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నిలోఫర్ దవాఖానలో ఉద్యోగం చేస్తున్న మేఘన తన ఇంటిని కిరాయికి ఇచ్చేందుకు హౌసింగ్.కామ్లో ప్రకటన పోస్టు చేసింది. ప్రకటన చూసిన సైబర్ నేరగాడు ఆర్మీ ఉద్యోగినంటూ ఫోన్ చేశాడు. రెండు నెలల అడ్వాన్స్ రూ.28 వేలు పంపిస్తానని నమ్మించి.. గూగుల్పే క్యూఆర్ కోడ్ పంపించాడు. క్యూఆర్ కోడ్లో రిసీవ్ అని కాకుండా.. పే అని ఉండటంతో బాధితురాలు క్లిక్ చేసింది. అంతే.. బాధితురాలి ఖాతా నుంచి రూ.2 లక్షలు కాజేశాడు.
దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు సైబర్ పోర్టల్తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ప్రశాంత్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. డబ్బు ఎక్కడికి వెళ్లిందని ఆరా తీయగా.. సైబర్నేరగాళ్లు పేమెంట్ గేట్వే ద్వారా డబ్బు కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పేమెంట్ గేట్వేకు పోలీసులు నోటీసులు జారీ చేసి, బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు. తమ వద్ద మర్చెంట్గా నమోదైన వారు ఈ నేరం చేసి ఉంటారని, బాధితుల డబ్బు తమ పేమెంట్ గేట్వే నుంచి తిరిగి వాపస్ ఇస్తామంటూ ఒప్పుకొని మంగళవారం ఆ డబ్బును బాధితుల ఖాతాకు బదిలీ చేశారు. తమ ఖాతాలోకి పోయిన సొమ్ము బదిలీ కావడంతో మేఘన, ఆమె భర్త ఉమాకాంత్ జాదవ్లు సంతోషం వ్యక్తం చేశారు. సైబర్ ఠాణాకు చేరుకొని ఏసీపీ కేవీఎం ప్రసాద్, సీఐ ప్రశాంత్కు కృతజ్ఞతలు తెలిపారు.