కౌలాలంపూర్ : తమ దేశానికి చెందిన ఓ వ్యక్తిని అమెరికాకు అప్పగించడంపై మలేషియా ప్రభుత్వంపై ఉత్తర కొరియా ఆగ్రహంతో ఉన్నది. ఈ మేరకు మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఉన్న తమ దేశ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. దాంతో ఉత్తర కొరియా రాయబార కార్యాలయం సిబ్బంది కార్యాలయాన్ని ఖాళీ చేసి రెండు బస్సుల్లో ఇంటికి తిరుగుముఖం పట్టారు.
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ సవతి సోదరుడు 2017 లో కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దారుణహత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి ఉత్తర కొరియా-మలేషియా మధ్య సంబంధాలు అంతంతగానే ఉన్నాయి. కాగా, రెండు రోజుల క్రితం మనీలాండరింగ్ ఆరోపణలపై ఉత్తర కొరియాకు చెందిన ఓ పౌరుడిని మలేషియా ప్రభుత్వం అమెరికాకు అప్పగించింది. ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ఉత్తర కొరియా.. ఈ అప్పగింతతో వారి కోపం నషాలానికి అంటింది. దాంతో మలేషియాతో దౌత్య సంబంధాలను తెంచుకున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది.
ఉత్తర కొరియా నిర్ణయాన్ని ఖండించిన మలేషియా ప్రభుత్వం.. దీనికి ప్రతిగా 48 గంటల్లో తమ దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఉత్తర కొరియా దౌత్యవేత్తలను కోరింది. దాంతో కిమ్ ఆదేశాల మేరకు కౌలాలంపూర్లోని రాయబార కార్యాలయాన్ని మూసేసి ఇంటికి రావాలని కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు. ఈ మేరకు షాంఘై బయల్దేరే విమానాన్ని అందుకునేందుకు రాయబార కార్యాలయం సిబ్బంది రెండు బస్సుల్లో ముల్లెమూటా సర్దుకుని బయల్దేరి వెళ్లింది కనిపించిందని అక్కడి అధికారులు తెలిపారు.