సియోల్: ఉత్తర కొరియా(North Korea) ఇవాళ ఓ కీలక ప్రకటన చేసింది. నిఘా శాటిలైట్ను కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. మూడవ ప్రయత్నంలో సక్సెస్ సాధించినట్లు ఆ దేశం వెల్లడించింది. దీంతో తమ నిఘా వ్యవస్థ పెరిగినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. చొల్లిమా-1 రాకెట్ ద్వారా మల్లిగ్యాంగ్-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపినట్లు ఉత్తర కొరియా తెలిపింది. మంగళవారం రాత్రి ఈ ప్రయోగం జరిగిందని, రాకెట్ ఎగిరిన 12 నిమిషాల తర్వాత శాటిలైట్ కక్ష్యలోకి ప్రవేశించినట్లు కొరియా స్పేస్ ఏజెన్సీ చెప్పింది.
శాటిలైట్ ప్రయోగం ద్వారా తమ ఆత్మరక్షణ చర్యలను పెంచుకుంటున్నట్లు ఆ దేశ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. యుద్ధం సమయంలో సంసిద్ధత గురించి నిఘా ఉపగ్రహం పనిచేస్తుందని ఉత్తర కొరియా తెలిపింది. శుత్రువుల ప్రమాదకర కదలికలపై తమ ఉపగ్రహం కన్నువేస్తుందని ఉత్తర కొరియా చెప్పింది.
మల్లిగ్యాంగ్-1 శాటిలైట్ పరీక్షను ఆ దేశ నేత కిమ్ జాంగ్ ఉన్ ప్రత్యక్షంగా వీక్షించారు. రాకెట్ నింగికి ఎగిరిన తర్వాత ఆయన శాస్త్రవేత్తలను అభినందించారు. దక్షిణ కొరియాతో పాటు ఇతర ప్రదేశాలను మానిటర్ చేసేందుకు మునుముందు మరికొన్ని స్పై శాటిలైట్లను ప్రయోగించనున్నట్లు ఉత్తర కొరియా చెప్పింది.
ఉత్తర కొరియా చేపట్టిన శాటిలైట్ పరీక్షను అమెరికా భద్రతా మండలి ప్రతినిధి వాట్సన్ ఖండించారు. అమెరికా మిత్రదేశాలు ఈ ప్రయోగాన్ని తప్పుపట్టాయి. శాటిలైట్ పరీక్షలు చేపట్టరాదు అని ఉత్తర కొరియాపై గతంలో అమెరికా నిషేధం విధించిన విషయం తెలిసిందే.