కీవ్, మార్చి 31: బలగాలను ఉపసంహరిస్తామన్న రష్యా మాటమార్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సరిహద్దులు, చెర్నిహివ్లోని జనావాసాలపై గురువారం క్షిపణులతో విరుచుకుపడింది. మైకోలివ్లోని పరిపాలనా భవనంపై చేసిన దాడుల్లో 20 మంది మృతి చెందారు. దినిప్రోపెత్రోవ్స్లోని సైనిక స్థావరంపై చేసిన రాకెట్ దాడుల్లో ఇద్దరు మరణించారు. ఈ దాడుల్లో సైనిక కేంద్రం అడ్మినిస్ట్రేటివ్ భవనం, ఇంధన డిపో ధ్వంసమయ్యాయి. మరోవైపు, చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ నుంచి రష్యా బలగాలు వెనక్కి వెళ్లిపోయినట్టు ఉక్రెయిన్ తెలిపింది. ఇదిలాఉండగా రష్యా సైన్యంలోకి కొత్తగా 1,34,500 మందిని నిర్బంధంగా చేర్చుకొనే డిక్రీపై ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. ఉక్రెయిన్ యుద్ధంతో దీనికి సంబంధంలేదని రష్యా పేర్కొంది. యుద్ధంపై పుతిన్ను ఆ దేశ రక్షణశాఖ తప్పుదోవ పట్టించిందని శ్వేతసౌధం పేర్కొంది. ఉక్రెయిన్ చేతిలో ఊహించని విధంగా రష్యా ఓడిపోతుండటం, ప్రపంచ దేశాలతో దూరమవ్వడం దీని పర్యావసానాలేనని వెల్లడించింది.
రెండురోజుల పర్యటన నిమిత్తం రష్యా విదేశాంగమంత్రి లావ్రోవ్ గురువారం భారత్ చేరుకొన్నారు. ప్రధాని మోదీ, విదేశాంగమంత్రి జైశంకర్తో శుక్రవారం భేటీ కానున్నారు. ఒకవైపు ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతుండగా, రష్యాతో భారత్ భేటీ కావడంపై అమెరికా, ఆస్ట్రేలియా అసంతృప్తి వ్యక్తం చేశాయి. పుతిన్కు మద్దతుగా ఉండకుండా, ఉక్రెయిన్ సార్వభౌమత్వ పరిరక్షణకు భారత్ కృషి చేయాలని హితవు పలికాయి.