హైదరాబాద్ : గాంధీ దవాఖానలో మంగళవారం నుంచి సాధారణ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి గాంధీలో సాధారణ సేవలు నిలిపివేసి, కేవలం కరోనా సేవలకే పరిమితం చేసిన విషయం తెలిసిందే. కరోనా కేసులు అదుపులోకి రావడంతో నాన్ కొవిడ్ సేవలను అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. దవాఖాన ప్రధాన భవనాన్ని కొవిడ్ బ్లాక్గా మార్చారు. ఈ భవనంలోని 2, 3వ అంతస్తులను కరోనా చికిత్సకు, 4వ అంతస్తులోని ఈఎన్టీ విభాగాన్ని బ్లాక్ఫంగస్ బాధితులకు కేటాయించినట్టు పేర్కొన్నారు.
కరోనా సేవల నేపథ్యంలో ప్రధాన భవనంలోకి సాధారణ రోగులకు అనుమతి ఉండదని చెప్పారు. ఓపీ బ్లాక్లో యథావిధిగా సేవలు కొనసాగుతాయని తెలిపారు. ఓపీ బ్లాక్పై అంతస్తులోని ఐసీయూ వార్డులో అత్యవసర సేవలు కొనసాగుతాయని, దశలవారీగా అన్ని రకాల శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మాస్కులు ధరించినవారినే అనుమతిస్తామని స్పష్టం చేశారు.