హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) హాస్పిటల్లో సాధారణ వైద్యసేవలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు వందమందికి ఓపీ సేవలు అందించారు. రంగారెడ్డి, దాని పొరుగు జిల్లాల ప్రజలకు టిమ్స్ ద్వారా వైద్యసేవలు మరింత చేరువ కానున్నాయి. 2020లో కలకలం సృష్టించిన కరోనా నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా కేవలం పది పదిహేను రోజుల్లోనే 1200 పడకల సామర్థ్యంతో టిమ్స్ను కొవిడ్ ప్రత్యేక దవాఖానగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
కరోనా మొదటి, రెండవ దశలో వేలమంది కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించింది టిమ్స్. ప్రస్తుతం కరోనా కేసులు దాదాపు తగ్గుముఖం పట్టడంతో సాధారణ వైద్యసేవలను ప్రారంభిస్తూ వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. 200 పడకలు కొవిడ్ కేసులకు, వెయ్యి పడకలు ఇతర రోగులకు కేటాయించి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతానికి మేజర్గా 8 విభాగాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆపరేషన్ థియేటర్లు సిద్ధమైన తరువాత సర్జికల్ విభాగాలను ప్రారంభిస్తాం అని టిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ విమలా థామస్ తెలిపారు.